టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సంచలన నిర్ణయం
ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో ప్రకటన
తిరుపతి : టీటీడీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. ఆయన కొలువు తీరాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఎవరూ ఊహించని రీతిలో వైకుంఠ ద్వార దర్శనాలను ఘనంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. తాజాగా టీటీడీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళ్యాణ మండపాలు మరింత మెరుగ్గా నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. భక్తుల నుండి అభిప్రాయం సేకరించేందుకు తక్షణమే హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా, టిటిడి కళ్యాణ మండపాలకు సంబంధించి భక్తుల నుండి స్థానిక శ్రీవారి సేవకుల ద్వారా ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా నిర్వహణ, ఏ ఏ సౌకర్యాలు అవసరమో తెలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కళ్యాణ మండపాల నిర్వహణను ఎఫ్ ఎం ఎస్ పరిధిలోకి తీసుకువస్తే పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని అన్నారు అనిల్ కుమార్ సింఘాల్. తక్షణమే టీటీడీ కళ్యాణ మండపాలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. మరింత మెరుగైన వసతి సౌకర్యాలు భక్తులకు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి.
