TTD: తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన వన్ మెన్ కమిషన్
తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన వన్ మెన్ కమిషన్
TTD : తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ తిరుమలలోని(TTD) క్యూలైన్ల నిర్వహణను పరిశీలించింది. శనివారం తిరుమలకు చేరుకున్న కమిషన్ చైర్మన్ సత్యనారాయణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, లైజన్ ఆఫీసర్ రూప్చంద్, కమిషన్ సభ్యులతో కలిసి ఉదయం ఔటర్ రింగ్రోడ్డులోని సర్వదర్శన భక్తుల క్యూలైన్లోకి ప్రవేశించి పరిశీలించారు. అక్కడ భక్తులు క్యూలైన్లోకి ప్రవేశించే విధానంపై కమిషన్ కు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఏఈవో శ్రీహరి, విజిలెన్స్ ఏవీఎస్వో విశ్వనాథం వివరించారు.
TTD…
అనంతరం నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకుని క్యూలైన్లను పరిశీలించారు. తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో సీసీటీవీ రూమ్ను, తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 13, 14, 15, 16, 17 నంబర్ల కంపార్లుమెంట్లను పరిశీలించారు. భక్తులు కంపార్టుమెంట్లోకి ప్రవేశం, నిష్క్రమణ, దర్శనం కోసం నిరీక్షించే విధానాన్ని చూశారు. దర్శనానికి భక్తులను విడిచిపెట్టే క్రమంలో తోపులాటలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అధికారులను అడిగారు. భవిష్యత్తులో తిరుమలలోని క్యూలైన్లలో తొక్కిసలాటల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ కోసం తిరుపతి బైరాగిపట్టెడలోని రామానాయుడు పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రంలో జనవరి 8న తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణను విచారణ అధికారిగా నియమించింది. ఇప్పటికే తిరుపతి తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో పర్యటించి విచారణ నిర్వహించిన జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిటీ బృందం, ఇవాళ తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, ఔటర్ రింగు క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లను జస్టిస్ సత్యనారాయణ బృందం పరిశీలించింది. పరిశీలన అనంతరం తిరుమలలో విశ్రాంతి గదికి వెళ్లారు.
కాగా తొక్కిసలాట అనంతరం టీటీడీ(TTD) పరిపాలనా భవనంలో ఘటనపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు బాధ్యులైన కొందరు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. పూర్తి స్థాయి న్యాయ విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ సత్యనారాయణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. ఆరు నెలలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో కమిటీ విచారణ వేగవంతం చేసింది.
Also Read : CM Revanth Reddy: రెండోసారి కూడా నేనే సీఎం – రేవంత్ రెడ్డి