Uttarakhand: ప్రతికూల వాతావరణంలో కూడా ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న అన్వేషణ
ప్రతికూల వాతావరణంలో కూడా ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న అన్వేషణ
Uttarakhand : భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండచరియలు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు పెను సవాల్ గా మారాయి. ప్రకృతి బురద విలయం సృష్టించడంతో ధరాలీకి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. డజన్ల మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. ఇళ్లు, హోటళ్లు, రోడ్లు కొట్టుకుపోవడంతోపాటు హర్సిల్ సైనిక స్థావరానికి చెందిన 11 మంది సైనిక సిబ్బంది సహా పలువురి ఆచూకీ తెలియడం లేదు. బుధవారం ధరాలీలో రెండు మృతదేహాలను వెలికితీయగలిగారు. మిగిలిన వారి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రతికూల వాతావరణంలో కూడా సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.
Uttarakhand Flass Floods Rescue
మంగళవారం ఉదయం ఉత్తర కాశీ (Kasi) నుంచి గంగోత్రికి బయల్దేరిన 28 మంది కేరళ పర్యాటకుల బృందం ఆచూకీ తెలియకపోడం తీవ్ర కలవరానికి కారణమైనా బుధవారం సాయంత్రం వారి ఆచూకీ తెలిసింది. బస్సుతో పాటు మార్గంలో చిక్కుకుపోయి, ప్రాణాలతో సురక్షితంగానే వారు ఉన్నారని తెలిశాక యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. 3 బృందాలను ధరాలీకి పంపామని, రోడ్లు మొత్తం ధ్వంసం కావడంతో వారు అక్కడికి చేరుకోలేకపోయారని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. మంగళవారం 27 మి.మీ. వర్షపాతమే నమోదైందని, మేఘ విస్ఫోటానికి, మెరుపు వరదలకు దారితీసేంత తీవ్రత దీనికి లేదని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోనూ (Himachal Pradesh) భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కిన్నార్ కైలాశ్ యాత్ర నిలిచిపోయింది. భారీ వరదలకు వంతెనలు కొట్టుకుపోవడంతో యాత్రికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. హిమాచల్లోని కినౌర్ కైలాస్ యాత్రా మార్గంలో కుండపోత వానల కారణంగా ట్రెక్కింగ్ మార్గాల్లో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే విషయం తెల్సుకున్న ఇండో టిబెటన్ బోర్డర్పోలీస్(ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు హుటాహుటిన రంగంలోకి దికి 413 మంది యాత్రికులను కాపాడాయి. పర్వతసానువుల గుండా వర్షపు నీటి ప్రవాహం భీకరంగా దూసుకొస్తోంది. దీంతో ట్రెక్కింగ్ మార్గమధ్యంలోని తాత్కాలిక తాంగ్లిప్పి, కాంగరాంగ్ వంతెనలు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోవడంతో యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు.
ట్రెక్కింగ్ మార్గం యాత్రకు అనువుగా లేకపోవడంతో కినౌర్ కైలాస్యాత్రను తాత్కాలికంగా నిలుపుదలచేస్తున్నట్లు కినౌర్ జిల్లా యంత్రాంగం బుధవారం ప్రకటించింది. టెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిన చాలా చోట్ల బురదపేరుకుపోయి జారే ప్రమాదం పెరిగింది. మిల్లింగ్ ఖాటా, గుఫా ప్రాంతాల్లో కొందరు యాత్రికులు సేదతీరుతున్నారు. వాళ్లకు కనీస సదుపాయాలను ఆర్మీ కల్పిస్తోంది. సముద్ర మట్టానికి 19,850 అడుగుల ఎత్తులో ఉండే కినౌర్ కైలాస్ ప్రాంతాన్ని శివునికి శీతాకాల విడిదిగా చెబుతారు. జూలై 15న ప్రారంభమైన ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ముగుస్తుంది. కినౌర్ జిల్లాతోపాటు హిమాచల్లోని చాలా ప్రాంతాలు బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో నాలుగు జాతీయరహదారులు సహా 617 రోడ్లను మూసేశారు. విద్యాసంస్థలకు ఒకరోజు సెలవు ప్రకటించారు.
Also Read : Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకు బెయిల్
