Vijay Rupani: రెండుసార్లు చావు తప్పించుకుని మూడోసారి దొరికిన విజయ్ రూపాణీ
రెండుసార్లు చావు తప్పించుకుని మూడోసారి దొరికిన విజయ్ రూపాణీ
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రయాణానికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. లండన్ లో ఉన్న తన భార్య, కుమార్తెను కలిసేందుకు విజయ్ రూపాణీ… అంతకుముందు రెండుసార్లు టిక్కెట్టు బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నారు. కాని మూడో సారి మాత్రం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చివరకు మూడోసారి లండన్ బయలుదేరినప్పటికీ… విధి వక్రీకరించి గమ్యాన్ని చేరకముందే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఆయన లక్కీ నంబర్గా భావించే ‘1206’ సంఖ్య కలిగిన తేదీ నాడే ఆయన మృతి చెందాల్సి వచ్చింది. మాజీ సీఎం విజయ్ రూపాణీ వ్యక్తిగత వాహనాలన్నీ అదే నంబరుతో ఉన్నట్లు సమాచారం.
విజయ్ రూపాణీ ఆయన భార్యతో కలిసి మే నెలలోనే లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా 171 విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల తన పర్యటనను రద్దు చేసుకున్న ఆయన… తన భార్యను అక్కడికి పంపించారు. జూన్ 5న వెళ్లేందుకు మళ్లీ బుక్ చేసుకున్నప్పటికీ… అనివార్య కారణాల వల్ల ఆ టికెట్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. బీజేపీ పంజాబ్ ఇన్ఛార్జీగా ఉన్న రూపాణీ… లుధియానా ఉపఎన్నిక నేపథ్యంలోనే తన ప్రయాణాన్ని రెండుసార్లు విరమించుకున్నట్లు తెలుస్తోంది. చివరకు జూన్ 12 లండన్కు ప్రయాణమైన రూపాణీ… విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
రూపాణీ లాగే మరో జంట కూడా
అహ్మదాబాద్కు సమీపంలోని ఆనంద్ ప్రాంతానికి చెందిన మోనాలి, సన్నీ దంపతులు కూడా విమాన ప్రమాదంలో మృతిచెందారు. లండన్ కు వెళ్లేందుకు వీరు జూన్ 6నే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని రద్దు చేసుకున్నారు. చివరకు 12వ తేదీన ఎయిరిండియా విమానంలో బయలుదేరిన వారిద్దరు కానరాని లోకాలకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వారి బంధువులు వాపోయారు.