West Bengal: వక్ఫ్ (సవరణ) చట్టంపై బెంగాల్లో ఘర్షణలు ! ముగ్గురు మృతి !
వక్ఫ్ (సవరణ) చట్టంపై బెంగాల్లో ఘర్షణలు ! ముగ్గురు మృతి !
West Bengal : వక్ఫ్ (సవరణ) చట్టంపై పశ్చిమ బెంగాల్ లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అవి పలుచోట్ల హింసాత్మక ఘటనలకు దారితీసాయి. మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. దీనితో ఆయా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించడంతోపాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ముఖ్యంగా ముస్లింల ఆధిపత్యం ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు తండ్రీకొడుకులు హర్గోబింద్ దాస్, చందన్ దాస్గా గుర్తించారు. అయితే వక్ఫ్ చట్టంపై నిరసనలు జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి, అన్నీ దోచుకుని, వెళ్లిపోయేముందు వీరిని పొడిచి చంపారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మరో ఘటనలో సజూర్మోరె వద్ద 21 ఏళ్ల యువకుడు తుపాకీ కాల్పుల్లో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. శంషేర్గంజ్లోని ధులియాన్లో ఇద్దరిపై కాల్పులు జరిగాయి. రెండ్రోజుల ఘటనలకు సంబంధించి 118 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందిస్తూ… కేంద్రమే నిరసనకారుల ప్రశ్నలకు జవాబు చెప్పాలని ‘ఎక్స్’ వేదికగా స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలుచేయబోమని పునరుద్ఘాటించారు.
West Bengal – కేంద్ర బలగాలను మోహరించండి -హైకోర్టు
బెంగాల్(West Bengal) లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై కలకత్తా హైకోర్టులో శాసనసభ విపక్షనేత సువేందు అధికారి పిటిషన్ దాఖలు చేశారు. శనివారం సెలవైనా అత్యవసర విచారణ జరపడానికి జస్టిస్ సౌమెన్ సేన్ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నియమించారు. దీనితో ముర్షిదాబాద్ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని ఈ ధర్మాసనం ఆదేశించింది. పరిణామాలపై తాము కళ్లు మూసుకోలేమని జస్టిస్ సౌమెన్ సేన్ వ్యాఖ్యానించారు. వివరాలను నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. సకాలంలో సరైన నిర్ణయం వెలువరించిందంటూ ఈ తీర్పును గవర్నర్ సి.వి.ఆనందబోస్ ఆహ్వానించారు.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై బెంగాల్(West Bengal) ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ… రాష్ట్రంలో హిందువులు “సురక్షితంగా లేరని” ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) శాంతి భద్రతల కోసం విజ్ఞప్తి చేస్తూనే… కొన్ని రాజకీయ పార్టీలు” “రాజకీయ లాబ్ధి కోసం మతాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని” ఆరోపణలు చేయడం ఆమె వక్రబుద్ధికి నిదర్శనం అంటూ విమర్శించారు.
యూసుఫ్ పఠాన్ పై బీజేపీ ఫైర్
వక్ఫ్ (సవరణ) చట్టంపై పశ్చిమ బెంగాల్(West Bengal) లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనల కారణంగా ముగ్గురు మృతిచెందగా… కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి సమయంలో మాజీ టీమిండియా క్రికెటర్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్ తన సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫోటోలను షేర్ చేసారు. దీనితో యూసుఫ్ పఠాన్ చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. కొంచమైనా సిగ్గు అనిపించడం లేదా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.
మాజీ టీమిండియా క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్ జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటైన బహరంపూర్ నుండి లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. బెంగాల్ దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎంపీ యూసుఫ్ పఠాన్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫొటోలను షేర్ చేశారు. ఆయన కాఫీ తాగుతున్న ఫొటో ఒకటి కాగా… దర్జాగా, ఉల్లాసంగా ఉన్న మరో ఫొటోను షేర్ చేశారు. దీనితో, ఎంపీ యూసుఫ్ పఠాన్పై బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రం, పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే వారి ఆదుకోకుండా, కనీసం పరామర్శించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘బెంగాల్ మండిపోతోంది. పోలీసులు మౌనంగా ఉండగా… మమతా బెనర్జీ హింసను ప్రోత్సహిస్తున్నారు. ఇంతలో యూసుఫ్ పఠాన్… ఒక ఎంపీగా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో హిందువులు ఊచకోతకు గురవుతున్న క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది తృణముల్ కాంగ్రెస్ అంటే అని’ ఘాటు విమర్శలు చేశారు. యూసుఫ్ పోస్టుపై అటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Atishi Marlena: ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై ఆప్ మాజీ సీఎం అతిశీ సంచలన ఆరోపణలు