#RevenueSarvey : మీ ఇల్లెక్కడ ఉంది? ఎప్పుడు కొన్నారు?
తెలంగాణలో ఇంటింటి సర్వే.. వివరాలు నమోదు చేస్తున్న అధికారులు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో సామాన్య ప్రజానీకానికి ఏమీ అర్థం కావడం లేదు. ఒకవైపు కరోనా..ఎవరికి ఉందో..ఎవరికి లేదో కూడా తెలియడం లేదు.. ఎవరికి వచ్చి పోయిందో కూడా తెలియడం లేదు..ఇదే గందరగోళం అనుకుంటే ఈ మధ్యలో రెవెన్యూ ప్రక్షాళన అంటూ అది ప్రజల నెత్తిమీదకు తెచ్చారు. ఆస్తుల వివరాలు అంటూ హడావుడి చేసి.. ఇప్పుడు ఇళ్ల మీద పడ్డారు.. నీ ఇల్లెక్కడ ఉంది? నీవెన్నాళ్ల నుంచి ఉంటున్నావు? ఇలా ఆస్తుల వివరాలన్నీ ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు.
దీనికి సమగ్ర భవన నిర్మాణ సర్వే గా నామకరణం చేశారు.పేదరిక నిర్మూలన సంస్థ, జాతీయ ఉపాధి హామీ పథకం, పంచాయతీ, ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఈ సర్వే కోసం నియమించారు. ఉదాహరణకు ఒకొక్క జిల్లాలో ఉన్న గ్రామాలను బట్టి అంటే ఉదాహరణకు 30 గ్రామాలుంటే అన్నిచోట్లకు వెళతారు. అయితే తెలంగాణాలో తండాలు ఎక్కువ కాబట్టి అవి వందల్లో ఉంటాయి. వాటి దగ్గరకు వెళతారు. ప్రస్తుతం తెలుస్తున్న విషయాలు చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.
పాత లెక్కల ప్రకారం ఒక జిల్లాలోనే పదివేల ఇల్లు కొత్తవి వచ్చినట్టు సమాచారం. అంటే ఆ రికార్డులు ఏ గతిన ఉన్నాయో అర్థమవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివరాలన్నింటిని ఆన్ లైన్ లో నమోదు చేసి ఒక ప్రత్యేక యాప్ ను తీర్చిదిద్దుతున్నారు. అందరి వివరాలు ఆయా ప్ లో ఉంటాయి..దానిని ధరణి పోర్టల్ తో అనుసంధానం చేస్తున్నారు. దీంతో ప్రజలెవరైనా సరే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వారి వివరాలన్నీ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతానికి చూస్తుంటే భవిష్యత్తు ఆశాజనకంగానే ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.