Woman: సంరక్షకురాలి ముసుగులో రిటైర్డ్ ప్రోఫెసర్ నుండి ఆస్తులు కాజేసిన మహిళ
సంరక్షకురాలి ముసుగులో రిటైర్డ్ ప్రోఫెసర్ నుండి ఆస్తులు కాజేసిన మహిళ
Woman: సంరక్షకురాలి ముసుగులో 82 ఏళ్ల ఓ ఐఐటీ విశ్రాంత ప్రొఫెసర్ వద్ద ఓ మహిళ రూ.6 కోట్ల ఆస్తులు కాజేసిన ఘటన ముంబయిలో వెలుగులోకి వచ్చింది. పోవైలోని హిరాందానీ గార్డెన్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముండే మన్మోహన్ అనే రిటైర్డ్ ఐఐటి ప్రొఫెసర్ వద్ద నికిత అనే మహిళ కొన్నేళ్లుగా సంరక్షకురాలిగా పని చేస్తోంది. ఆయనకు ఉన్న అనారోగ్య కారణాలను అవకాశంగా తీసుకొని ఇటీవల ఆయన వద్ద ఉన్న మూడు ఫ్లాట్లతో సహా ఆస్తినంతటిని తన పేరు మీద రాయించుకొని… అతడిని వృద్ధాశ్రమంలో చేర్పించింది. తన తండ్రిని చూడడానికి పుణెలో(Pune) ఉంటున్న ప్రొఫెసర్ కుమారుడు గత నెలలో అతడి నివాసానికి వచ్చాడు. అయితే తన తండ్రి అక్కడ లేడని… స్థానికంగా ఉన్న ఓ అనాథాశ్రమంలో ఉన్నాడని తెలుసుకొని నిర్ఘాంత పోయాడు. అక్కడికి వెళ్లి తన తండ్రిని కలిసి అసలు విషయం తెలుసుకున్నాడు. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Woman Cheats
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2009 నుంచి ఐఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మన్మోహన్ పోవై ప్రాంతంలోని హిరాందానీ గార్డెన్లోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నారు. అతడి కుమారుడు, భార్య ఉద్యోగ రీత్యా పుణె(Pune)లో ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి… వెళ్తుంటారు. 2017లో మన్మోహన్ స్థానికంగా ఉన్న పార్కులో యోగా సాధన చేస్తున్న సమయంలో నిఖితా నాయక్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆయనకు అవసరం ఉన్న సమయంలో సహాయం చేసేది. ఆమెపై నమ్మకం ఏర్పడడంతో నికితను తనకు కేర్టేకర్గా నియమించకున్నాడు. నాటి నుంచి ఆమె కూడా అదే ఫ్లాట్లో ఉండేది. రెండేళ్ల అనంతరం అతడి కంటి చూపు మందగించడంతో ఆయన మొబైల్ ఫోన్ ను ఆపరేట్ చేయడంలో, బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడంలో సహాయం చేసేది.
ఆయన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, కార్డులు ఆమె వద్దే ఉండేవి. 2025 ఏప్రిల్లో వివిధ చట్టపరమైన పనులు ఉన్నట్లు నమ్మించి సదరు మహిళ వృద్ధుడిని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి, అతడికి తెలియకుండా వృద్ధుడి ఆస్తిలో మూడింట ఒక వంతును గిఫ్ట్ డీడ్గా తన పేరు మీదకు బదిలీ చేయించుకుంది. బంగారు ఆభరణాలు, సంతకం చేసిన చెక్కులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటివాటిని కూడా తీసుకొని మొత్తం రూ.6 కోట్ల ఆస్తిని కాజేసింది. అనంతరం రిటైర్డ్ ప్రొఫెసర్ను అనాథాశ్రమంలో చేర్పించి పరారయ్యింది. వృద్ధుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేర్టేకర్పై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Also Read : India: పాకిస్తాన్ కు భారత్ షాక్ ! జమ్మూకశ్మీర్ లో చేపట్టే ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం పెంపు !