#Wetlands : జీవ వైవిధ్య కేంద్రాలు.. చిత్తడి నేలలు

World Wetland Conservation Day

Wetlands : సముద్రం, నది, ఇతర నీటి వనరుల తీర ప్రాంతాలలో లోతు తక్కువ వుండి ఎక్కువ కాలం నీటి నిల్వ వుండే భూములను చిత్తడి నేలలు అంటారు. మంచి నీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు, మడ అడవులున్న తీర ప్రాంతాలన్నీ చిత్తడి నేలలే. ఎగువ ప్రాంతంలోని భూములు అలల తాకిడికి దెబ్బ తినకుండా ఈ చిత్తడి నేలలు అడ్డు కట్ట వేస్తాయి. అరుదైన మొక్కలకు, పక్షులకు, జంతువులకు, చేపలు గుడ్లు పెట్టడానికి ఈ చిత్తడి నేలలు చాల అనుకూలం. సమీప నీటి నాణ్యతను పెంచడం లోను, కాలుష్య కారకాలను గ్రహించడం లోను చిత్తడి నేలలు ప్రాధాన్యతను పొషిస్తాయి.

మానవుల తప్పిదాలతో పర్వావరణానికి చాల హాని కలుగు తున్నది. అలాగే చిత్తడి నేలలకు కూడా మినహాయింపు లేకుండా పోతున్నది. ఫలితంగా హాని జరుగు తున్నది. ప్రజలు వ్యవసాయ అవసరాలకు ఈ భూములను ఆక్రమించు కొని రసాయన ఎరువులకు వాడడం వల్ల…. నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడం తోను, చిత్తడి నేలలు విధ్వంసానికి గురవు తున్నాయి. ప్రభుత్వం పరిశ్రమల కొరకు చిత్తడి నేలలను కేటాయిచడంలో అవి మరింత విధ్వంసానికి గురవు తున్నాయి. చిత్తడి నేలల పరిరక్షణకు 1971, ఫిబ్రవరి రెండవ తేదీన ఇరాన్ లోని రాంసార్ లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. అప్పుడు తీసుకున్న ఉమ్మడి ఒప్పందం పై 164 దేశాలు సంతకం చేశాయి. దాన్నే “రాంసార్ ఒప్పందం” అంటారు.

చిత్తడి నేలల పరిరక్షణకు ఈ ఒప్పందంలో కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. భారత దేశం కూడా ఈ ఒప్పందం పై సంతకం చేసింది. చిత్తడి నేలలు జీవ వైవిద్యానికి కేంద్రాలు. ఈ ప్రదేశాలలో చాలా జల చర, ఉభయ చర జీవులు… మొక్కలు, జంతువులు ఉంటాయి. చిత్తడి నేలలు ముఖ్యంగా నదీ పరీవాహక ప్రదేశాలు, సముద్ర తీర ప్రాంతాల కు సమీపంగా ఉంటాయి. ఇవి నదుల గుండా వచ్చే కాలుష్య కారక పదార్థాలను, తమలో ఇముడ్చు కుంటాయి. సముద్ర భారీ అలల నుండి సునామీల నుండి తీర ప్రాంతాలను రక్షిస్తాయి. అదే విధంగా నదుల వరదల నుండి కాపాడుతాయి. సముద్ర ప్రాంతాలు, నదీ తీరాలు, చెరువులు, సరస్సులు, నీటి ముంపు ప్రాంతాలు, తీరాల సమీపంలోని ఉప్పునీటి కయ్యలు, మడ అడవులు, మానవ నిర్మిత చేపల చెరువులు, వరి పొలాలు, సాగునీటి ఆనకట్టలు వంటివి చిత్తడి నేలల కోవకు చెందుతాయి.

మానవాళి మనుగడకు ఈ నేలలు ఎంతో కీలకం. అయితే మానవుడు తన ఆవాసాల కోసం ఇలాంటి చిత్తడి నేలలను పూడ్చి గృహాలు నిర్మించడం వల్ల చిత్తడి నేలలు కనుమరుగు అవుతున్నాయి. దీనికి ఉదాహరణ ముంబై , కోల్ కత వంటి నగరాలు. దీని వల్ల బయో డైవర్సిటీ తీవ్రంగా నష్టపోతుండటం జరుగుతున్నది. ఈ క్రమంలో 1971 ఫిబ్రవరి 2 వ తేదీన ఇరాన్ దేశం లోని “రాంసార్” పట్టణంలో చిత్తడి నేలల సంరక్షణకు ఒక సదస్సు జరగగా, అన్ని దేశాలు చిత్తడి నేలలను రక్షించడానికి అంగీకరించాయి. అప్పటి నుండి ఫిబ్రవరి 2 వ తేదీని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపు కుంటున్నారు.

చిత్తడి నేలల(Wetlands)  అవసరాన్ని తెలియజెప్పి, సమాజాన్ని చైతన్య పరచడం ద్వారానే వాటిని పరిరక్షించు కోవడం సాధ్యమవుతుంది. అందుకోసం వివిధ స్థాయుల్లో అవగాహన కల్పించాలి. విద్యార్థులకు పాఠ్యాంశంగా చేయాలి.

విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సాగునీరు, వ్యవసాయ, మత్స్య, అటవీ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో చిత్తడి నేలల పరిరక్షణకు కృషి చేయాలి.

గడచిన యాభయ్యేళ్ల కాలంలో చిత్తడి నేలల్లో సుమారు 60 శాతం మత్స్య సంపద, పక్షులు, క్షీరద సంతతి, సరీసృపాలు, ఉభయ చరాలు ఇప్పటికే అంతరించినట్లు పరిశోధనలు తెలుపు తున్నాయి. ఇకనైనా మేల్కొని, ఇంకా అంతరించి పోకుండా కాపాడుకోవడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉంది.

(ఫిబ్రవరి 2…ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినం)

No comment allowed please