YS Jagan Mohan Reddy: సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
YS Jagan Mohan Reddy : సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనానికి క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో సింహాచలం ఘటన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) హుటాహుటీన విశాఖ చేరుకున్నారు. అయితే జగన్ విశాఖ చేరుకునేసరికి మృతదేహాలకు కుటుంబ సభ్యులకు అప్పగించడంతో… ఈ ఘటనలో మృతి చెందిన మధురవాడకు చెందిన పిల్లా ఉమామహేష్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఈ ఘటనలో మృతి చెందిన పిల్లా ఉమామహేష్, అతని భార్య శైలజ మృతదేహాలకు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. సింహాచలంలో దైవదర్శనానికి వెళ్లిన పిల్లా ఉమామహేష్, అతని భార్య శైలజ గోడ కూలిన ఘటనలో మృతి చెందారు. వాళ్ల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) మధురవాడలోని చంద్రంపాలెంకు వెళ్లారు. ఆయన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగాన్ని లోనయ్యారు. దీంతో ఆయన వాళ్లను హత్తుకుని ఓదార్చారు.
YS Jagan Mohan Reddy Shocking Comments
అనంతరం మీడియాతో వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) మీడియాతో మాట్లాడుతూ… సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలీదా ?. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారు.
ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట పూర్తి చేశారు. పదడుగుల ఎత్తు… డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని పూర్తి చేశారు. దాదాపుగా సంవత్సరం అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకి తెలియదా?. జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు?. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. మంత్రుల కమిటీ ఏం చేసిందసలు?. కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట… ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు?. వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం సందర్భంగా ప్రతీసారి వర్షం పడుతుందని తెలుసు. అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్ పెట్టారు.
చంద్రబాబు(CM Chandrababu) ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు.. అదీ ఆలయాల్లో చూడాల్సి వస్తోంది. రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని బలిగొన్నారు. తిరుమల గోశాలలో గోవులు కూడా చనిపోయాయి. కాశినాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయి. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారు. ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు. ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబే దోషి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ ఘటనలోనూ నిందను మాపైకి నెట్టే యత్నం చేశారు. కానీ, వాళ్ల హయాంలో.. అదీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు.
ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మొక్కుబడిగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్ వస్తున్నాడనే ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే… బాధ్యతగా అధిక పరిహారం చెల్లించాం. ఈ బాధిత కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఆ పని తప్పకుండా చేస్తాం’’ అని వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకి వైఎస్ జగన్ హితవు పలికారు.
సింహాచలం ప్రమాద ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు
విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ను నియమించింది. ఇందులో సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉంటారని పేర్కొంది. అలాగే, ఈ కమిషన్కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read : YS Sharmila Reddy: వైఎస్ షర్మిలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు