YS Jagan: పోలీసులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మాస్ వార్నింగ్

పోలీసులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మాస్ వార్నింగ్

YS Jagan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఏపీ పోలీసులను ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాము అధికారంలోనికి వచ్చిన తరువాత ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న పోలీసుల అధికారులను… బట్టలూడదీసి కోర్టుల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దోషులుగా తేలుస్తామని జగన్ వ్యాఖ్యానించారు. ఆపై ఆ పోలీసులను యూనిఫాం ఊడబీకి ఉద్యోగాల్లేకుండా చేస్తామని జగన్(YS Jagan) హెచ్చరించారు. ఇప్పటికైనా పోలీసులు అధికారులు తమ తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.

YS Jagan Warning to AP Police

అనంతపురం జిల్లా పరిధిలోని రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి వెళ్లిన జగన్(YS Jagan)… గ్రామంలో ఇటీవలే హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం లింగమయ్య ఇంటి వద్దే జగన్(YS Jagan) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… ‘‘లింగమయ్య హత్యతో​ పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు దిగజారాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టిన ఎంపీపీ ఎన్నికల్లోవైఎస్సార్‌సీపీ గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్‌ను తలపిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు’’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

‘‘చంద్రబాబుకు బలం లేదని స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారు. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. చంద్రబాబుకు అనుకూలంగా లేదని 7 చోట్ల వాయిదా వేయించారు. టీడీపీ ఎమ్మెల్యే, తనయుడు, రామగిరి ఎస్‌ఐ దౌర్జన్యాలు చేశారు. లింగమయ్య హత్య కేసును నీరుగార్చుతున్నారు. లింగమయ్య హత్యపై కంప్లైంట్‌ వాళ్లే రాసుకొచ్చారు. లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్రలు వేయించారు. లింగమయ్య కొడుకు ఫిర్యాదును పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన వారినే సాక్షులుగా పెట్టారు. తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లోనూ దౌర్జన్యాలు చేశారు. ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలో కూటమి నేతలు కిడ్నాలు చేశారు. రామకుప్పం ఎంపీపీ ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేశారు’’ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పలు కీలక ఘటనలను జగన్ ప్రస్తావించారు. అందులో భాగంగా ఆయన ఇటీవలే అరెస్టై రోజుల తరబడి జైలులో గడిపిన సినీ ప్రముఖుడు పోసాని కృష్ణ మురళితో మొదలుపెట్టి… ఇంకా జైలు జీవితం గడుపుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఉదంతాలను ప్రస్తావించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టులను కూడా జగన్ ప్రస్తావించారు. వైసీపీ నేతలను వేదించడమే లక్ష్యంగా కూటమి సర్కారు రెడ్ బుక్ పాలనను సాగిస్తోందని ఆయన ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే… ఆ విషయాలను డైవర్ట్ చేసేందుకే టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read : Minister Parameshwara: లైంగిక వేధింపుల విషయంలో చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి క్షమాపణ

Leave A Reply

Your Email Id will not be published!