Ys Sharmila: జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన గనుల దోపిడీపై విచారణ జరపాలి : వైఎస్ షర్మిల
జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన గనుల దోపిడీపై విచారణ జరపాలి : వైఎస్ షర్మిల
జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన గనుల దోపిడీపై విచారణ జరపాలని వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన గనుల దోపిడీపై గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు, పెద్ద డొంకలు కూడా కదలాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకట్ రెడ్డి అయితే.. తెరవెనుక ఉండి, సర్వం తానై, రూ.వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుని తిన్నారని ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని, టెండర్లు, ఒప్పందాలు, నిబంధనలన్నీ బేఖాతరు చేసి.. అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్జీటీ నిబంధనలను తుంగలో తొక్కారని షర్మిల విమర్శించారు.
రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు.. పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని కూటమి సర్కార్ను డిమాండ్ చేస్తున్నామన్నారు. సహజ వనరుల దోపిడీపై సీబీఐ విచారణ జరగాలన్నారు.