CM Revanth Reddy: నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పార్టీ బీఆర్ఎస్ – సీఎం రేవంత్రెడ్డి
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పార్టీ బీఆర్ఎస్ - సీఎం రేవంత్రెడ్డి
CM Revanth Reddy : విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పార్టీ బీఆర్ఎస్(BRS Party) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణాలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్… తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం హైదరాబాద్లోని బాబూ జగజ్జీవన్ రామ్ భవన్ లో ఎస్సీ గురుకులాల్లో టెన్త్, ఇంటర్ చదివి… ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదగా బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ… తమ ప్రభుత్వం హయాంలో మెరుగైన విద్య, వైద్యం అందిస్తున్నామన్నారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన నిలదీశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
CM Revanth Reddy Slams BRS Party
‘‘చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు… చదువు మాత్రమే. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుంది. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది. కోఠిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు చదువులు వద్దు.. కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారు.
దళితులు, బీసీలు… గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్టుగా మాజీ సీఎం వ్యవహరించారు. తెలంగాణ వస్తే.. ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారు. మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు గానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. పీజీలు చేసిన విద్యార్థులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న పిల్లలకు తాము ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉంది.
సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారు. అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలి. నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారు. ఆర్నెల్లు కూడా విరామం లేకుండా వాళ్ల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు. విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారు అని సీఎం విమర్శించారు. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం విడుదల చేశామన్నారు. కానీ నోటికాడి కూడును కింద పడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని గత ప్రభుత్వ పెద్దలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోందని పేర్కొన్నారు.
వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆరు నెలలు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అలాంటి వారు మీకు ఎదురైతే ప్రశ్నించండంటూ యువతకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే మీరు మీ జీవితంలో రాణిస్తారన్నారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుందని విద్యార్థులకు ఆయన కీలక సూచన చేశారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దంటూ విద్యార్థులకు హితవు పలికారు. కష్టపడండి.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.
Also Read : Telangana Government: ఎన్ఎస్ఈతో తెలంగాణ వి హబ్ కీలక ఒప్పందం