CM Revanth Reddy: తెలంగాణా రైతులకు శుభవార్త ! రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ !
తెలంగాణా రైతులకు శుభవార్త ! రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ !
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు రుణ మాఫీకి తెలంగాణా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రుణమాఫీకి కటాఫ్ నిర్ణయించింది. డిసెంబర్ 9వ తేదీని రుణమాఫీ కటాఫ్ తేదీగా ఏకగ్రీవ తీర్మానం చేసింది రాష్ట్ర కేబినెట్. అంతేకాదు.. రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 9, 2023 ముందు నాటికి తీసుకున్న రుణాలన్నింటినీ ఒకే విడతలో మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 47 లక్షలకు పైగా మంది రైతులకు ఊరట లభించనుంది.
ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రుణామాఫీలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటం కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో రుణాల మాఫీపై స్పీడ్ పెంచింది రేవంత్ సర్కార్. ప్రధానంగా ఆగస్ట్ 15 లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన మేరకు రైతు రుణాల మాఫీ ప్రధానంశంగా రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం నాడు భేటీ అయ్యింది. ఈ భేటీలో రైతు రుణమాఫీ ఎలా చెయ్యాలి. దశల వారీగా చేయాలా? ఒకేసారి చేయాలా? అర్హులు ఎవరు? ఎవరి రుణాలు మాఫీ చేయాలి? అంశాలపై కూలంకశంగా చర్చించారు. అనంతరం.. రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయాలని తీర్మానం చేశారు. అది కూడా ఆగస్ట్ 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.
CM Revanth Reddy – ప్రభుత్వ నిర్ణయంపై రైతుల హర్షం !
రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే, ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.
Also Read : Election Commission of India: జమ్మూకశ్మీర్ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీఐ కసరత్తు !