Saurabh Bharadwaj: ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు
Saurabh Bharadwaj : ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నేత, దిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణంలో పలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ నేడు తనిఖీలు చేపట్టింది. దిల్లీలోని సౌరభ్ భరద్వాజ్ నివాసంతో పాటు మరో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దర్యాప్తు సంస్థ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
ED Raids on Saurabh Bharadwaj House
2018-19లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 24 ఆసుపత్రుల నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం రూ.5,590 కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఓ ఐసీయూ ఆసుపత్రిని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా… మూడేళ్లు దాటినా అది పూర్తికాలేదు. ఇందుకోసం రూ.800 కోట్లు ఖర్చు చేసినా… కేవలం సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో ఆ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే తాజాగా సౌరభ్ భరద్వాజ్ నివాసంలో తనిఖీలు చేపట్టింది. ఈ దాడులను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సౌరభ్పై తప్పుడు కేసు నమోదు చేశారని ఆప్ ఆరోపించింది. ఈడీ చెబుతున్న సమయంలో ఆయన మంత్రిగా లేరని తెలిపింది.
Also Read : Vaishno Devi: వైష్ణోదేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి 41 మంది మృతి
