Anand Mahindra: డాక్టర్ గణేశ్ రఖ్ ను ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా
డాక్టర్ గణేశ్ రఖ్ ను ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల సోషల్ మీడియాలో డాక్టర్ గణేశ్ రఖ్ చేస్తోన్న సేవలను ప్రశంసిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. పుణెకు చెందిన వైద్యుడు గణేశ్ కొన్ని సంవత్సరాలుగా తమ ఆస్పత్రిలో ఆడపిల్ల జన్మిస్తే ఆ కుటుంబం నుంచి ఎలాంటి ప్రసవ రుసుమును తీసుకోవడం లేదని తెలిసి నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు. ఈ వైద్యుడి గురించి ఐఏఎస్ అధికారి డి. ప్రశాంత్ నాయర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా… ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) రీ పోస్ట్చేశారు.
Anand Mahindra Appreciates
ఆ పోస్టులో వివరాల ప్రకారం… ఓ దినసరి కూలీ తన భార్యను ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెకు సిజేరియన్ చేయాలనడంతో వైద్య ఖర్చుల కోసం ఇల్లు తాకట్టు పెట్టాలనుకున్నాడు. కాన్పు తర్వాత ఆత్రుతగా ‘ఎవరు పుట్టారు’ అని వైద్యుడిని అడిగాడు. ‘నీకు మహాలక్ష్మి పుట్టిందని డాక్టర్ చెప్పాడు. పాప తండ్రి సంకోచిస్తూ… సిజేరియన్, ఆస్పత్రి ఖర్చుల గురించి ఆరాతీశాడు. ‘మహాలక్ష్మిలాంటి అమ్మాయి పుట్టింది. ఈ ఆస్పత్రిలో పాప పుడితే ఎలాంటి రుసుము తీసుకోను’ అని వైద్యుడు అన్నాడు. దాంతో వైద్యునికి ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ పోస్టుపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందిస్తూ… ‘ఇద్దరు కుమార్తెలకు తండ్రిగా ఆ ఆనందాన్ని వర్ణించలేను. ఉచితంగా ప్రసవాలు చేయడం ఆయన దాతృత్వానికి నిదర్శనం. ఇలాంటి పోస్ట్తో ఈ వారాన్ని ఆరంభించడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలు, పనులతో సమాజానికి ఉపయోగపడేలా ఏవిధంగా ముందుకు కదలాలో తమని తాము ప్రశ్నించుకోవాలి.’’ అని పోస్టులో ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.
గడాక్టర్ గణేశ్ రఖ్ 2007లో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. అప్పటి నుంచి ‘ఆడపిల్లలను కాపాడాలి’ అన్న నినాదంతో దాదాపు 1000కిపైగా కాన్పులను ఆ వైద్యుడు ఉచితంగా చేశారు. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ… ఆడపిల్ల జన్మిస్తే కాన్పు ఖర్చులను తీసుకోకపోవడం సమాజానికి అమ్మాయిలు ఎంత విలువైన వారో తెలియజేస్తోందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలాంటి వారికి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ చేస్తోన్న సేవలను కొనియాడుతున్నారు.
Also Read : Vaishno Devi: వైష్ణోదేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి 41 మంది మృతి
