బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తామని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నదాతలకు తమ సర్కార్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కరువు పరిస్థితులకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు డీకే శివకుమార్. మీ నిర్లక్ష్యం వల్ల ఏ రైతుకూ ఇబ్బంది కలగకూడదు. ఏమాత్రం అలసత్వం లేదా నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తే అవకాశం ఉన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా కేవలం కాగితాలకే పరిమితం కావడం, సహాయక చర్యల్లో తప్పుడు వివరాలు సమర్పించడం లేదా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రై
తులను రక్షించడం , తాగునీటిని అందుబాటులో ఉంచడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశాలని ఆయన నొక్కి చెప్పారు. విధాన సౌధలో డిప్యూటీ కమిషనర్లు, జిల్లా పంచాయతీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో శివకుమార్ మాట్లాడారు. వర్షపాతం లోపం ఉన్న నేపథ్యంలో, అధికారులు ‘టీమ్ కర్ణాటక’గా పని చేయాలని, క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని, కరువు నివారణ చర్యలను సకాలంలో అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశం అత్యంత కీలకమని పేర్కొన్న శివకుమార్, వర్షపాతం లోపం వల్ల తలెత్తే ఏ సంక్షోభానైనా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ధృవీకరించని నివేదికలను సమర్పించవద్దని అధికారులను హెచ్చరించారు.
ఇది చాలా ముఖ్యమైన సమావేశం. రాబోయే రోజుల్లో కరువు వల్ల తలెత్తే ఏ సంక్షోభానైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం ఇక్కడ కేవలం కాగితపు పనులను పరిశీలించడానికి రాలేదు. అన్ని గణాంకాలు, వివరాలు క్షేత్రస్థాయి వాస్తవాలతో సరి చూసుకోబడతాయి. కాబట్టి, ధృవీకరణ లేకుండా కేవలం అంకెలను మాత్రమే ఇవ్వకండి అని ఆయన అన్నారు. తాగునీరు, పశువులకు మేత, పంటల బీమా మరియు గ్రామీణ ప్రాంతాల్లో బోర్వెల్స్ తవ్వకం వంటి అంశాలపై తక్షణమే దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రతి గ్రామీణ తాలూకాకు అదనంగా రూ. 1 కోటిని ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని ఆయన తెలిపారు.