టిమ్స్ ఆస్ప‌త్రిలో వైద్య సేవ‌లు ప్రారంభం

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ సనత్‌నగర్

హైదరాబాద్ : సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సనత్‌నగర్ లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక టిమ్స్ అందుబాటులోకి వ‌చ్చింది. ప్రభుత్వ వైద్యరంగంలో అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ రూపుదిద్దుకుంది. ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. 22.6 ఎకరాల విస్తీర్ణంలో, 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ఈ సమగ్ర వైద్య సముదాయాన్ని అభివృద్ధి చేశారు. క్లాసిక్ ఆర్కిటెక్చర్‌తో నాలుగు బ్లాకులుగా నిర్మించిన టిమ్స్ 75 శాతం నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ సాధించింది. ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా దీన్ని తీర్చి దిద్దారు. ఈ ఆసుపత్రిలో రోగులకు సమగ్ర వైద్య సేవలు అందనున్నాయి. ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నిర్మితమైన టిమ్స్ లో ఏర్పాటు చేయటం విశేషం. ఈ వ్యవస్థ ద్వారా రోగుల నుంచి పరీక్షలు చేసేందుకు సేకరించిన నమూనాలు ఒకటి నుంచి రెండు నిమిషాల్లోనే సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరతాయి.

సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి దశలవారీగా సంవత్సరాల పాటు కొనసాగుతుంటుంది. అందుకు భిన్నంగా టిమ్స్ సనత్‌నగర్‌ను ఒకే దశలో, ఒకే మాస్టర్‌ప్లాన్ కింద సంపూర్ణ సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఆస్పత్రిలో మొత్తం 1,082 పడకలు, అందులో 300 ఐసీయూ పడకలు ఉన్నాయి. మొత్తం పడకల్లో దాదాపు 30 శాతం ఐసీయూలకు కేటాయించడం ద్వారా అత్యవసర, క్లిష్ట వైద్య సేవలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఈపీసీ విధానంలో నిర్మించే బాధ్యతను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు అప్పగించింది. సివిల్ నిర్మాణాలు, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ (ఎంఈపీ) వ్యవస్థలతోపాటు ఆధునిక వైద్య పరికరాలు, సాంకేతిక సదుపాయాలను ఎంఈఐఎల్ సమకూర్చింది.

ఆస్పత్రిని నాలుగు ప్రధాన బ్లాకులుగా ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ ల్యాబ్‌లు, 12 మైక్రోబయాలజీ ల్యాబ్‌లు, 10 బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి. బ్లాక్-ఏలో అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి. బ్లాక్-బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. బ్లాక్-సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి. బ్లాక్-డీలో పరిపాలన, విద్యా విభాగాలతోపాటు 200 మంది కూర్చునే ఆడిటోరియం ఉంది.

టిమ్స్ సనత్‌నగర్‌లో అత్యంత ప్రత్యేకమైన సాంకేతిక సదుపాయాల్లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా వ్యవస్థను టిమ్స్ సనత్ నగర్ లో ఏర్పాటు చేశారు. సీల్డ్ ట్యూబ్‌లు, గాలి ఒత్తిడితో రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర వినియోగ వస్తువులను వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌లు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య కేవలం 1–2 నిమిషాల్లో ఈ విధానం ద్వారా తరలించవచ్చు. దీంతో పరీక్షల ఫలితాల కోసం పట్టే సమయం తగ్గడంతోపాటు కలుషితమయ్యే ప్రమాదం కూడా తగ్గుతుంది.అవయవ మార్పిడి, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్ వంటి ఆరు ప్రధాన రంగాల్లో టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దింది. కిడ్నీ, కాలేయం, గుండె, బహుళ అవయవ మార్పిడి సేవలకు ఇక్కడ అవకాశం ఉంది. ఆధునిక కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలు, లీనాక్ ఆధారిత రేడియోథెరపీ, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ బ్యాకప్‌తో 30 క్లినికల్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి.

ఆస్పత్రిలో 3.0 టెస్లా ఎంఆర్‌ఐ, 128-స్లైస్ సీటీ స్కానర్, అధునాతన మామోగ్రఫీ యూనిట్, 5 ఎక్స్‌రే యంత్రాలు ఏర్పాటు చేశారు. రోగులతో వచ్చే సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో నిర్మించిన ధర్మశాలలో 200 మందికి వసతి కల్పించేలా సదుపాయాలు ఉన్నాయి. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీతో పాటు, కేంద్ర వంటశాల, లాండ్రీ,, వైద్య వాయు (మెడికల్ ఆక్సిజన్) పైప్‌లైన్ వ్యవస్థలకు ప్రత్యేక బ్లాకులు ఇందులో నిర్మించారు. టిమ్స్ సనత్‌నగర్ నిర్మాణంలో పర్యావరణహిత సాంకేతికతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ విధానం ద్వారా 75 శాతం నీరు ఆదా ఐంది . తగిన సామర్థ్యంతో ఎస్టీపీ, ఈటీపీలు ఏర్పాటు చేసి మురుగునీరు, వ్యర్థ ద్రవాలను ఈ ఆసుపత్రిలో శుద్ధి చేయనున్నారు. వర్షపు నీటిని సేకరించి యార్డ్ వాటర్ సంప్‌ల ద్వారా మొక్కలు, గ్రీన్ కారిడార్లకు వినియోగించే విధానం టిమ్స్ సనత్ నగర్ లో అమలుకానుంది. పర్యావరణహిత నిర్మాణం, ఇంధన సామర్థ్య వ్యవస్థల కారణంగా ప్రాజెక్టుకు ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించింది.

నిర్మాణ సమయంలో 35 లక్షల సురక్షిత పని గంటలు నమోదు చేసినట్లు ఎంఈఐఎల్ గ్రూప్ తెలిపింది. ప్రమాదాలు చోటుచే సుకోకుండా నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది.హైదరాబాద్ నడిబొడ్డున క్లాసిక్ ఆర్కిటెక్చర్‌తో కాంక్రీట్ నిర్మాణంగా రూపుదిద్దుకున్న టిమ్స్ సనత్‌నగర్ ప్రభుత్వ వైద్యరంగంలో భారీ స్థాయి మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, భద్రతను సమన్వయం చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా నిలిచింది. సామాన్య ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో లభించే స్థాయి అధునాతన వైద్య సేవలను ప్రభుత్వ వ్యవస్థలోనే అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యానికి ఈ ఆస్పత్రి ప్రతీకగా నిలవనుంది. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రైవేటు కార్పొరేట్ వైద్య సంస్థలకు దీటైన స్థాయిలో ఆధునిక, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించగలవని ఈ ప్రాజెక్టు చాటి చెబుతోందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!