Election Commission Comment : నేర‌స్థుల‌పై న‌జ‌ర్ ఏదీ

చోద్యం చూస్తున్న ఎన్నిక‌ల సంఘం

Election Commission Comment : దేశంలో ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డింద‌న్న భావ‌న నెల‌కొంది. దేశానికి సంబంధించి వాచ్ డాగ్ లా ఉండాల్సిన రాజ్యాంగం ఇప్పుడు మ‌రింత ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతోంది. ర‌క్షించాల్సిన న్యాయ వ్య‌వ‌స్థ సైతం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఈసీ ఏం చేస్తోందంటూ నిల‌దీస్తున్నారు బుద్ది జీవులు. రాజ్యాంగ ప‌రంగా ఎన్నో ప‌వ‌ర్స్ ఉన్నాయి ఈసీకి. కానీ వాటిని ఉప‌యోగించు కోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు లేక పోలేదు. ప్ర‌స్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిలో తెలంగాణ‌(Telangana), మ‌ణిపూర్ , చ‌త్తీస్ గ‌ఢ్ , మ‌ధ్య ప్ర‌దేశ్ , రాజస్థాన్ ఉన్నాయి. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం(Election Commission) ఎన్నిక‌ల షెడ్యూల్ ఖ‌రారు చేసింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నెల పూర్త‌య్యే స‌రిక‌ల్లా అన్ని రాష్ట్రాల‌లో రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించింది.

Election Commission Comment Viral

న‌వంబ‌ర్ 3న గెజిట్ ప్ర‌క‌టిస్తుంది. ఇది ప‌క్క‌న పెడితే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గ‌డువు 13 నిర్ణ‌యించిన ఈసీ ఉప సంహ‌రించు కునేందుకు న‌వంబ‌ర్ 15 డెడ్ లైన్ విధించింది. ఇదంతా ఒక ఎత్తు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వారిలో అత్య‌ధికంగా నేర చ‌రిత్ర క‌లిగి ఉన్న వారే కావ‌డం గ‌మ‌నార్హం. అంతే కాదు ఒక‌రిపై మ‌రొక‌రు హ‌ద్దులు దాటుతున్నారు. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అధికారం ఉంది క‌దా అనే అహంకారంతో నోరు జారుతున్నారు. ఆద‌ర్శంగా ఉండాల్సిన వాళ్లు, స్పూర్తి దాయ‌కంగా నిల‌వాల్సిన వాళ్లు స‌భ్య‌త‌, సంస్కారాన్ని మ‌రిచి పోయి రెచ్చి పోతున్నారు. కేసుల సంగ‌తి అలా ఉంటే నేర‌స్థులు, అక్ర‌మాలు, అవినీతి ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఎదుర్కొంటున్న వాళ్లే ఇవాళ చ‌ట్ట స‌భ‌ల్లోకి ఎన్నిక కావ‌డం స‌మాజానికి తీర‌ని అన్యాయాన్ని త‌ల‌పెట్టేలా చేస్తోంది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు న‌డుచు కోవాల్సిన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిద్ర పోతోందా అన్న అనుమానం త‌లెత్త‌క మాన‌దు. రోజూ వారీ త‌నిఖీల్లో భాగంగా సామాన్యుల‌ను, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను త‌నిఖీలు, సోదాలు చేస్తున్నారే త‌ప్పా ప్ర‌జా ప్ర‌తినిధులు, వివిధ పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఎందుకు త‌నిఖీ చేయ‌డం లేద‌ని సామాన్య జ‌నం నిల‌దీస్తున్నారు. నిగ్గ‌దీసి ప్ర‌శ్నిస్తున్నారు. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే కొలువు తీరిన బీఆర్ఎస్ పార్టీకి తాబేదారులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అత్య‌ధిక శాతం ఉన్న‌తాధికారులు. క‌లెక్ట‌ర్ గా ఉన్న స‌మ‌యంలో వెంక‌ట్రామిరెడ్డి అనే ఆయ‌న సీఎం కాళ్లు మొక్కాడు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ అయ్యాడు. ఇక వైద్య శాఖ కు ఇంచార్జి గా ఉన్న శ్రీ‌నివాస రావు అనే వ్య‌క్తి ప‌దే ప‌దే కాళ్లు మొక్క‌డం, పార్టీ కండువా వేసుకునేంత ప‌ని చేశాడు. ఈయ‌న‌కు అద‌న‌పు ఇంఛార్జి ఇచ్చారు. మ‌రి సిఈవోగా ఉన్న వికాస్ రాజ్ కు ఇది క‌నిపించక పోవ‌డం విడ్డూరంగా ఉంది. ఒక ఎస్పీ అయితే మంత్రిని స్టేజి పైనే ప్ర‌శంస‌లు కురిపించాడు.

నేర‌స్థులు, కేసులు, అక్ర‌మాల‌కు పాల్ప‌డే వ్య‌క్తులు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా నిషేధం విధించాల్సిన అవ‌స‌రం ఉంది. అప్పుడే ఆశించిన డెమోక్ర‌సీ ప‌రిఢ‌విల్లుతుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్ర‌స్తుతం ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ఉంది ప్ర‌స్తుతం. దీనిని ర‌క్షించు కోవాల్సిన బాధ్య‌త ఓట‌ర్ల‌పై ఉంది. అంత‌కు మించిన బాధ్య‌త ఈసీపై ఉంది. ఇక‌నైనా ఈసీ క‌ళ్లు తెర‌వాలి. లేక పోతే స‌మాజానికి, నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకానికి అన్యాయం త‌ల‌పెట్టిన వాళ్ల‌వుతారు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

Also Read : Revanth Reddy : మేడిగ‌డ్డ ఘ‌ట‌న సీఎందే బాధ్య‌త‌

Leave A Reply

Your Email Id will not be published!