HCA Election Comment : ఎవరు గెలిచినా ‘కల్వకుంట్ల’దే హవా
జగన్ అధ్యక్షుడైనా ఆ ఫ్యామిలీదే రాజ్యం
HCA Election Comment : తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కల్వకుంట్ల ఫ్యామిలీకి కేరాఫ్ గా మారింది. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఒకే ఒక్కడై నడిపించినా ఆ తర్వాత కొడుకు, కూతురు, అల్లుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంటుంది. ఇది పక్కన పెడితే భారత దేశంలోనే కాదు ప్రపంచ క్రికెట్ రంగంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఉన్నంత ఆదాయం ఇంకే క్రీడా సంస్థకు లేదు. గత కొంత కాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర వివాదాలకు , ఆరోపణలు, ప్రత్యారోపణలు, కేసులకు కేరాఫ్ గా మారింది. మాజీ క్రికెటర్లు ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగారు. చివరకు భారత క్రికెట్ జట్టుకు ఎనలేని విజయాలు సమకూర్చి పెట్టిన మహమ్మద్ అజాహరుద్దీన్ హెచ్ సీఏ(HCA) కు చీఫ్ గా ఎన్నికైనా అంతులేని అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నాడు. చివరకు తాజాగా జరిగిన కార్యవర్గం ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా పోయాడు. సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది.
HCA Election Comment Viral
భారత క్రికెట్ జట్టుకు ఎందరో ప్లేయర్లను అందించింది ఈ సంస్థ. కానీ రాజకీయాలు చోటు చేసుకోవడం, అక్షయ పాత్రగా మారడంతో ప్రతి ఒక్కరి కన్ను దీనిపై పడింది. చివరకు క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించ లేని స్థితికి చేరి పోయింది హెచ్ సీ ఏ. దీంతో బీసీసీఐ హైదరాబాద్ అంటేనే భయపడే స్థితికి వచ్చింది. చివరకు ఐసీసీ వరల్డ్ కప్ సందర్బంగా కొన్ని మ్యాచ్ లను కేటాయించింది. ఇది పక్కన పెడితే తాజాగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా అధికార పార్టీకి చెందిన జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. పేరుకు ఆయన ఉన్నా చక్రం తిప్పేదంతా కల్వకుంట్ల కుటుంబమేనని చెప్పక తప్పదు. సీఎం తనయురాలు ఎమ్మెల్సీ కవిత హెచ్ సీ ఏకు చీఫ్ గా ఉండాలని అనుకున్నట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె పేరు రావడం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు ఆమెను లిక్కర్ క్వీన్ అని పేరు పెట్టడం తో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికే పరిమితమైంది.
ఇది పక్కన పెడితే జగన్ మోహన్ రావు కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఆయనకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఫుల్ సపోర్ట్ చేశారు. దీంతో రేపొద్దున వీరు ఏం చెబితే అక్కడ అదే నడుస్తుందన్నది వాస్తవం. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి సంస్థలో, ప్రతి రంగంలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఆధిపత్యం, కనుసన్నలలోకి వెళ్లి పోయాయి. ఇక హెచ్ సీ(HCA) ఏ కూడా వారి చేతుల్లోకి వెళ్లి పోయిందన్న ప్రచారం జోరందుకుంది. ఏది ఏమైనా కల్వకుంట్ల కుటంబం ఎంత శక్తివంతమైనదో దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఈ దేశంలో దౌర్భాగ్యమైన స్థితి ఏమిటంటే బీసీసీఐలో ఎక్కడా మ్యాచ్ ఆడని అమిత్ షా కొడుకు జే షా కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం గులాబీ పార్టీ మద్దతుతో గెలిచిన జగన్ రావు ఇక చక్రం తిప్పబోతున్నాడన్నమాట.
Also Read : Sailajanath : బాబు అరెస్ట్ బాధాకరం