IND vs AUS 1st Test : పట్టు బిగుస్తున్న భారత్
హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ
IND vs AUS 1st Test : మరాఠా లోని నాగ్ పూర్ లో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ జట్టు పట్టు బిగుస్తోంది. తొలి రోజు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ స్కిప్పర్ అంచనాలు తప్పాయి.
సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి దిగిన స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించారు. మొదటి రోజు పూర్తిగా భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది.
భారత బౌలర్లు రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి ఆసిస్ ఆశలపై నీళ్లు చల్లితే మరో స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ కళ్లు చెదిరే బంతులతో బోల్తా కొట్టించాడు. అతను 3 వికెట్లు తీశాడు. స్టార్ పేసర్లు మహ్మద్ షమీ , స్పీడ్ స్టర్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 177 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు(IND vs AUS 1st Test) 24 ఓవర్లు ఆడింది. ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది.
టీమిండియా స్కిప్పర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సత్తా చాటాడు. హాఫ్ సెంచరీ చేశాడు. 56 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నైట్ వాచ్ మెన్ గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు.
అంతకు ముందు ఇటీవలే ఓ ఇంటి వాడైన కేఎల్ రాహుల్ 20 పరుగులే చేసి నిరాశ పరిచాడు. మరోసారి తక్కువ స్కోర్ కే ఔట్ కావడం పై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇక భారత జట్టు భారీ స్కోర్ చేస్తే ఆసిస్ కు కష్టాలు తప్పవు. మరో వైపు ఇదే మైదానంపై భారత జట్టు 6 టెస్టులు ఆడింది. ఇందులో 4 టెస్టుల్లో గెలిచింది. ఒకటి ఓడి పోగా మరోటి డ్రాగా ముగిసింది.
Also Read : స్పిన్నర్ల మ్యాజిక్ ఆసిస్ 177 ఆలౌట్