India-Russia: భారత్-రష్యా సంయుక్తంగా ‘ఎక్సర్సైజ్ జాపడ్’
భారత్-రష్యా సంయుక్తంగా ‘ఎక్సర్సైజ్ జాపడ్’
India-Russia : అమెరికా బెదిరింపులకు తలొగ్గకుండా రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాల మోత మోగించిన సంగతి తెలిసిందే. కానీ, భారత్ మాత్రం రష్యాతో ఉన్న తన చిరకాల స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఈ తరుణంలో రెండు దేశాలు ‘ఎక్సర్సైజ్ జాపడ్’ను నిర్వహిస్తున్నాయి.
India-Russia Relation
సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు భారత్-రష్యా (India-Russia) బలగాలు ఆపరేషన్ జాపడ్ పేరిట సంయుక్తంగా సైనిక విన్యాసాల్లో పాల్గొంటాయి. సంప్రదాయ యుద్ధరీతులు, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా సరికొత్త వ్యూహాలను మార్పిడి చేసుకుంటాయని భారత రక్షణశాఖ వెల్లడించింది. ఇందుకోసం భారత సైన్యానికి చెందిన 65 మందితో కూడిన బృందం మంగళవారం రష్యాకు వెళ్లింది. నిజ్నీ నగరంలోని ములినో ట్రైనింగ్ గ్రౌండ్లో ఈ విన్యాసాలు జరుగుతాయని తెలిపింది. వీటివల్ల ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం అవుతాయని, స్నేహబంధం మరింత పటిష్టంగా మారుతుందని పేర్కొంది. పరస్పర సహకారం, విశ్వాసం మెరుగుపడుతుందని వెల్లడించింది.
ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై అసహనంగా ఉన్న ట్రంప్.. తన సహాయకుడు పీటర్ నవారోతో భారత్ గురించి ఇష్టారీతిగా మాట్లాడిస్తున్నారు. నవారో వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన భారత్.. తన ప్రయోజనాలను కాపాడుకునే దిశగానే అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఎస్సీఓ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి కారులో ప్రయాణించి, తమ ఆలోచనలను పంచుకున్నారు. వీరిద్దరు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కలిసి ఒకే వేదికపై కనిపించారు. ఇది ట్రంప్ అక్కసుకు కారణమైంది. దాంతో ఐరోపా దేశాలు కూడా భారత్పై 100 శాతం సుంకాలు విధించాలని సూచించారు. మిత్రదేశాలను కట్టడి చేసి.. రష్యాపై ఒత్తిడి తెస్తేనే ఉక్రెయిన్లో త్వరగా శాంతి నెలకొంటుందని ఒక అసంబద్ధ ప్రచారానికి తెరతీసిన ట్రంప్.. ఇప్పుడు ఐరోపాను కూడా తోడు తెచ్చుకుంటున్నారు. ఈ ఒత్తిడికి తలొగ్గని భారత్.. రష్యాతో స్నేహబంధాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపుతోంది. అందుకు తాజా పరిణామం ఓ నిదర్శనం.
Also Read : Indian Tourist: నేపాల్ లో నిరసనలపై భారత టూరిస్ట్ ఆవేదన
