Jairam Ramesh: ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విసుర్లు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విసుర్లు
Jairam Ramesh : భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటించుకుంటున్న సంగతి తెలిసిందే. పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) దెబ్బకి… కకావికలమైన పాకిస్తాన్… అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆశ్రయించింది. మరోవైపు కాల్పులు విరమించాలంటూ భారత్ ను కోరింది. దీనితో భారత్ కాల్పులను విరమించింది. అయితే కాల్పుల విరమణ క్రెడిట్ మాత్రం ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తానే కారణమంటూ పదేపదే ప్రకటించుకుంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని కొన్ని రోజులుగా ప్రశ్నిస్తోంది. ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా మాత్రమే కాల్పుల విరమణ జరిగిందని ప్రధాని ఎందుకు చెప్పలేకపోతున్నారని మరోసారి అడిగింది.
Jairam Ramesh Slams
‘‘21 రోజుల్లో ఇది 11వ సారి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించానంటూ ట్రంప్ పదేపదే ఒకే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణలు తగ్గించడానికి తాము జోక్యం చేసుకున్నామని, వాణిజ్యాన్ని ఒక సాధనంగా వాడామని చెప్తున్నారు. చివరికి కోర్టులోనూ అదే వాదన. కానీ ట్రంప్ ప్రకటనలపై స్నేహితుడు నరేంద్రమోదీ పూర్తిగా మౌనం వహిస్తున్నారు. ఆయన ఎందుకు మాట్లాడటం లేదు..?’’ అని ఎక్స్ వేదికగా హస్తం సీనియర్ నేత జైరాం రమేశ్(Jairam Ramesh) పోస్టు పెట్టారు.
‘‘భారత్- పాక్ల మధ్య కాల్పుల విరమణకు మా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించింది. వాణిజ్యం విషయంలోనూ మేం అండగా ఉన్నాం. ‘ఉద్రిక్తతలకు ముగింపు పలికితేనే వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం. లేకపోతే.. ఎటువంటి వాణిజ్యం చేయబోం’ అని స్పష్టంచేశాం. దీంతో ఆ రెండు దేశాలు సానుకూలంగా స్పందించాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీన్ని భారత్ ఇప్పటికే ఖండించింది. ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతున్న సమయంలో ఆయా సందర్భాల్లో అమెరికా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఫోన్లో మాట్లాడారని… ఎక్కడా కూడా వాణిజ్యం గురించి ప్రస్తావన రాలేదని స్పష్టం చేసింది. అంతకుముందు కాల్పుల విరమణపైనా ట్రంప్ తొలుత ప్రకటన చేయగా… భారత్ మాత్రం ట్రంప్ పాత్రను అసలు ప్రస్తావించలేదు.
Also Read : MJ Akbar: పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన ఎంజే అక్బర్