#KurnoolAirPort : కర్నూల్ ఎయిర్ పోర్టు కు గ్రీన్ సిగ్నల్
సీఎం జగన్ రెడ్డి వల్లనే పర్మిషన్లు
Kurnool Air Port : రాయలసీమ వాసుల కొన్నేళ్ల కల తీరబోతోంది. గాలిమోటార్లు ఎక్కాలనే వారి కల నిజం కాబోతోంది. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలు నగరం ఇపుడు దేశీయ విమానయాన రంగపు పటంలోకి ఎక్కనుంది. త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కర్నూలు నుంచి తిరుపతి వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఓర్వకల్లులో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేశారు. కాగా అనుమతి కోసం ఇన్నాళ్లు వేచి చూడాల్సి వచ్చింది.
కొత్త సంవత్సరంలో విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు కీలకలమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పర్మిషన్లు వచ్చినట్లు వెల్లడించారు. ఈ విమానాశ్రయంపై(Kurnool Air Port )ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. వేగంగా నిధులు మంజూరు చేయడంతో అతి తక్కువ కాలంలోనే కీలకమైన అనుమతులు పొందగలిగామన్నారు.
గత ఏడాది విమానాశ్రయం డెవలప్ మెంట్ కోసం 150 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ క్రెడిట్ అంతా వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో కర్నూలు జిల్లాలో(Kurnool Air Port )పారిశ్రామికాభివృద్ధి మరింత పరుగులు పెడుతుందన్నారు. అంతే కాక వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. ఎయిరో డ్రమ్ లైసెన్స్ తో పాటు ఇతర అనుమతులు తీసుకు రావడంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీఏడీసీ ఎండీ భరత్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికన్ వలవన్ కృషి చేశారని మంత్రి చెప్పారు.
No comment allowed please