Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు మరోసారి లుకౌట్ నోటీసులు !
ప్రజ్వల్ రేవణ్ణకు మరోసారి లుకౌట్ నోటీసులు !
Prajwal Revanna:కర్ణాటక రాజకీయాలను కుదిపివేస్తున్న లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ‘సిట్’ ఆయనకు లుకౌట్ నోటీసులు జారీచేయగా… శనివారంనాడు తాజాగా మరోసారి ఆయనకు, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ‘అశ్లీల వీడియోల కేసు’ దర్యాప్తులో భాగంగా హసన్ లోని ప్రజ్వల్ ఇంటికి కూడా సిట్ అధికారులు వెళ్లి… ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
తాజా పరిణామాలపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ… హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణకు లుకౌట్ నోటీసులు జారీ చేసాము. ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పటికే విదేశాలకు పారిపోగా… హెచ్డీ రేవణ్ణ కూడా విదేశాలకు వెళ్లే యోచన చేసే అవకాశాలున్నందున లుకౌట్ నోటీసులు ఇచ్చాము. దర్యాప్తు బృందం ముందు హాజరయ్యేందుకు తమకు సమయం కావాలంటూ ప్రజ్వల్, హెచ్డీ రేవణ్ణ కోరడంతో వారికి ఫస్ట్ లుకౌట్ నోటీసు ఇచ్చారు. తాజాగా మరోసారి నోటీసు పంపారు.
Prajwal Revanna:
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో ఇటీవల వీడియోలు రావడం, అందులోనూ సార్వత్రిక ఎన్నికల మధ్యలో ఇవి వెలుగు చూడటం రాజకీయంగా కూడా సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే రేవణ్ణ దేశం విడిచిపెట్టి జర్మనీకి వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులతో ఆయన దేశంలోకి అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలుంటుంది.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటమేకాకుండా వారి అశ్లీల చిత్రాలను తీసి దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు శనివారంనాడు ఒక లేఖ రాశారు. న్యాయం కోసం పోరాడుతున్న బాధితుల పట్ల సానుభూతి, సంఘీభావం చూపించాల్సిన అవసరం ఉందని, ఇంతటి నీచమైన నేరాలకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తెచ్చే బాధ్యతను అన్ని పార్టీలు తీసుకోవాలని అన్నారు.
Also Read:-Acharya Pramod Krishnam: కాంగ్రెస్ పార్టీపై బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు !