Mamata Banerjee: ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన మమతా బెనర్జీ

ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన మమతా బెనర్జీ

 

 

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారంనాడు విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) బెంగాలీ మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ‘నిశ్శబ్ద రిగ్గింగ్’ అని ఆరోపించారు. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా తన పార్టీ కార్యకర్తలతో కలిసి మంగళవారనాడు కోల్‌కతా వీధుల్లో భారీ ర్యాలీని మమత ముందుండి నడిపించారు. ఆమె మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలనే ఈసీ ఎంచుకోవడం వెనుక ఉద్దేశాన్ని ఆమె ప్రశ్నించారు. చివరిగా 2002లో బెంగాల్‌లో ‘సర్‌’ కార్యక్రమం నిర్వహించారు. అప్పట్లో రెండేళ్లపాటు ఈ ప్రక్రియను సాగించిన ఈసీ ఈసారి కేవలం నెలరోజులకే పరిమితం చేయడం ఏంటని నిలదీశారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్‌తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు.

 

దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీలు) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) రెండో విడత కార్యక్రమం మంగళవారం మొదలైంది. ఇందులోభాగంగా నెలరోజులపాటు దాదాపు 51 కోట్లమంది ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ప్రక్రియను ఈసీ అధికారులు చేపడతారు. అయితే ఈ ప్రక్రియలో భాగం అవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళల్లోని అధికార పార్టీలు ‘సర్‌’ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనితో ఆ రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ వ్యతిరేకతల మధ్యనే ఈ ప్రక్రియను ఈసీ ప్రారంభించాల్సి వచ్చింది. ‘సర్‌’ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ సుప్రీంకోర్టును ఇప్పటికే ఆశ్రయించింది. డీఎంకే పిటిషన్‌ ఈ నెల 6 లేక 7 తేదీల్లో విచారణకు రానుంది.

పశ్చిమ బెంగాల్‌ లో ‘సర్‌’ ప్రక్రియపై టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కోల్‌కతాలో రోడ్డెక్కారు. అర్హుడైన ఒక్క ఓటరు పేరును జాబితానుంచి తొలగించినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. దీనిని రాజకీయ ప్రేరేపిత సవరణ ప్రక్రియగా ఆమె దుయ్యబట్టారు.

 

ఇంత హడావిడిగా ఎందుకు?

ఎలక్షన్ కమిషన్ టైమ్‌లైన్ పెట్టుకుని మరీ ఇంత హడావిడిగా ఎస్ఐఆర్ నిర్వహించడాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. బెంగాల్‌లో 2022లో ఓటర్ రివిజన్ జరిగిందని, అందుకు రెండేళ్లు పట్టిందని అన్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ నెలరోజుల్లోనే పూర్తిచేయాలనుకుంటున్నారని అన్నారు. ఈసీ పారదర్శకత్వను ప్రశ్నిస్తూ… బిహార్‌ ఎస్ఐఆర్‌లో ఎంతమంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను గుర్తించారో చెప్పాలన్నారు.

ఓటర్లను తొలిగించారో

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్‌తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు. హిందీ, పంజాబీ మాట్లాడే వాళ్లు ఎలా పాకిస్థానీయులు కాదో బంగ్లా మాట్లాడే వాళ్లు బంగ్లాదేశీయులు కాదని మమత అన్నారు.

భయంతో ఏడుగురు మృతి

ఎస్ఐఆర్ పేరుతో ఓటర్లను బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఈ భయాలతోనే ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు తీసుకున్నారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. లీగల్ ఓటర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగిస్తే ఢిల్లీలో మెగా నిరసనకు మద్దతుదారులంతా సిద్ధంతా ఉండాలని కోరారు. కాగా, టీఎంసీ నిరసనలపై బీజేపీ మండిపడింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ ఇదని ఆక్షేపణ తెలిపింది. అక్రమ వలసదారులను తమ ఓటు బ్యాంకుగా చేసుకున్న మమతా బెనర్జీ ఇప్పుడు వారికి రక్షణ కల్పిస్తున్నారని బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ ఆరోపించారు.

Leave A Reply

Your Email Id will not be published!