MSP: వరి సహా 14 పంటలకి మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
వరి సహా 14 పంటలకి మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
MSP : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 2025-26 ఖరీఫ్ సీజన్ కు 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం దిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. వరి సాధారణ రకం ధరను క్వింటాలుకు రూ.2,369గా, ఏ-గ్రేడ్ ధరను రూ.2,389గా నిర్ణయించింది. గత ఏడాది కంటే ఇది రూ.69 ఎక్కువ. ఈ పెంపుతో క్వింటాల్ వరిధాన్యం ధర రూ.2,389కు చేరినట్లు వెల్లడించారు. ఎంఎస్పీ(MSP) కోసం కేంద్ర ప్రభుత్వం ఈసారి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించినట్లు స్పష్టంచేశారు. పంటల సగటు ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర నిర్ణయించినట్లు అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) ప్రకటించారు.
ఈ సీజన్లో అత్యధికంగా నైగర్సీడ్ (గడ్డినువ్వులు) ధర రూ.820, రాగి కనీస మద్దతు ధర రూ.596 పెంచారు. పత్తి రూ.589, నువ్వులు రూ.579, వేరుసెనగ రూ.480, కంది రూ.450, పొద్దుతిరుగుడు రూ.441, మినుములు రూ.400, జొన్న ధర రూ.328 మేర పెంచారు. వరి (రూ.69), పెసలు (రూ.86), సజ్జలు (రూ.150), మొక్కజొన్న (రూ.175) ధరల పెరుగుదల కనిష్ఠంగా ఉంది. వరి, రాగి, జొన్న, పెసలు, వేరుసెనగ, సోయాబీన్, నువ్వులు, నైగర్సీడ్, పత్తి పంటల సాగుకయ్యే ఖర్చుపై 50% అదనపు రాబడి వచ్చేలా ఈ ధరలు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అత్యధికంగా సజ్జపై 63%, మొక్కజొన్న, కందిపై 59%, మినుములపై 53% అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వరి, కంది, పెసలు, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, నైగర్సీడ్ ధరల పెరుగుదల ఈసారి తక్కువగా ఉంది. జొన్న, రాగి, వేరుసెనగ, సోయాబీన్, పత్తి పెరుగుదల అధికంగా ఉంది.
MSP – రైతులకు రుణ పథకం పొడిగింపు
కిసాన్ క్రెడిట్ కార్డుల(కేసీసీ-KCC) ద్వారా తక్కువ కాలవ్యవధికి రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందజేసేందుకు ఉద్దేశించిన మాడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్(ఎంఐఎస్ఎస్)ను 2025–26లోనూ కొనసాగించాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. ఈ పథకం కింద 7 శాతం వడ్డీకే రుణాలు అందజేస్తారు. రైతులకు పంటసాగు కోసం రూ.3 లక్షల వరకు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం రూ.2 లక్షల వరకు అందిస్తున్న రుణాలపై 4.5% వడ్డీ రాయితీ అందిస్తోంది. ఇందులో 1.5% వడ్డీ రాయితీ, సకాలంలో తిరిగి చెల్లించినవారికి ప్రోత్సాహకంగా 3% మొత్తాన్ని అందిస్తోంది. దీనివల్ల రైతులకు నికరంగా 4% వడ్డీ పడుతుంది. ఈ పథకం కొనసాగింపు వల్ల ఖజానాపై రూ.15,640 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) చెప్పారు. ఎంఐఎస్ఎస్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. కేసీసీ ద్వారా రైతులు రూ.3 లక్షల దాకా రుణం పొందవచ్చు. పాడి పశువులు, చేపల పెంపకం కోసం ఈ సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలో 7.75 కోట్లకుపైగా కేసీసీ ఖాతాలు ఉన్నాయి.
బద్వేల్-నెల్లూరు జాతీయ రహదారికి రూ.3,653 కోట్లు
ఏపీలో బద్వేల్-నెల్లూరు మధ్య రూ.3,653 కోట్లతో 108.13 కి.మీ పొడవున నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. జాతీయ రహదారి 67పై డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) విధానంలో దీని నిర్మాణం చేపడతారు. ఇది పూర్తయితే విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవాలోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్-బెంగుళూరు నడవాలోని ఓర్వకల్లు నోడ్, చెన్నై-బెంగుళూరు నడవాలోని కృష్ణపట్నం నోడ్కి మంచి అనుసంధానం ఏర్పడుతుందని కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. దేశ సరుకు రవాణాపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. ఇది ఎన్హెచ్-67లో వైఎస్సార్ కడప జిల్లాలోని గోపవరం గ్రామం వద్ద ప్రారంభమై ఎన్హెచ్-16లో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా గురువిందపూడి వద్ద ముగుస్తుంది. దీనివల్ల కృష్ణపట్నం ఓడరేవుకు వెళ్లే దూరం 33.9 కి.మీ తగ్గుతుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో రైలు మార్గాల విస్తరణకు కేంద్రం రూ.3,399 కోట్లు కేటాయించింది.
Also Read : Supreme Court: రేప్ కేసులో యువకుడికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్