NIA: జమ్మూకశ్మీర్లోని 32 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు ! ఉగ్రవాదుల ఆవాసాల లక్ష్యంగా దాడులు !
జమ్మూకశ్మీర్లోని 32 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు ! ఉగ్రవాదుల ఆవాసాల లక్ష్యంగా దాడులు !
ఆపరేషన్ సింధూర్ అనంతరం జమ్మూ కాశ్మీర్ లో రక్షణ దళాలు, జాతీయ దర్యాప్తు సంస్థలు ఉగ్రవేటను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని 32 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ఉగ్రముఠాల ఆవాసాలు, వారికి అంతర్గతంగా మద్దతునిస్తున్న వారి నివాస ప్రాంగణాలపై దాడులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో ఆయుధాలు, నేరాలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలను పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది.
పుల్వామా, కుల్గాం, శోపియాన్, బారాముల్లా, కుప్వాడా జిల్లాల్లో పాకిస్థాన్ మద్దతుతో పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ జమ్మూకశ్మీర్, ముజాహిద్దీన్ గజ్వాత్- ఉల్- హింద్, జమ్మూకశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్, కశ్మీర్ టైగర్స్ తదితర ఉగ్రసంస్థల కార్యకర్తలు, మద్దతుదారుల నివాసాలపై ఎన్ఐఏ దాడులు జరిపింది. ఇవన్నీ లష్కరే తయ్యిబా, జైషే మహ్మద్, అల్ బదర్ వంటి నిషేధిత ఉగ్రసంస్థలకు అనుబంధ సంస్థలుగా కొనసాగుతూ వాటి కుట్రలను అమలుపరుస్తున్నాయని ఎన్ఐఏ ఆరోపించింది.
శనివారం చినాబ్, అంజీ వంతెనల ప్రారంభం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఈ వంతెనను, దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను ప్రారంభిస్తారు. కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైళ్లనూ ప్రధాని ప్రారంభించనున్నారు. ఇవి శనివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. రూ.46,000 కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చినాబ్ వంతెన నిర్మాణం సాకారం కావడం వెనుక ఉన్న శ్రమ, ఇంజనీరింగ్ నైపుణ్యంపై ప్రజలకు తెలియజేసేందుకు కౌరీలో రూపొందించిన మ్యూజియాన్ని సైతం మోదీ ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా జమ్మూకశ్మీర్లో పర్యటించనుండటంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వీటిని సమీక్షించారు.