BRICS Summit: ‘గ్లోబల్ సౌత్’కు అన్యాయం – బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
‘గ్లోబల్ సౌత్’కు అన్యాయం - బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
BRICS : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న దేశాలకు నిర్ణయం తీసుకునే జాబితాలో స్థానం దక్కడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత ఇలా ప్రతి విషయంలోనూ గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులవుతున్నాయని అన్నారు. బ్రెజిల్ లోని రియో డీ జనీరోలో నిర్వహించిన బ్రిక్స్ (BRICS) దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. భారత్ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు హాజరయ్యారు.
BRICS Summit
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ… పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత అభివృద్ధి తదితర అంశాలపై ప్రపంచ సంస్థల నుంచి గ్లోబల్ సౌత్ దేశాలకు కనీస సహకారం ఉండటం లేదన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు లేకుండా ఈ సంస్థలన్నీ సిమ్కార్డు ఉన్నా.. నెట్వర్క్లేని మొబైల్ఫోన్ల లాంటివని వ్యాఖ్యానించారు.
‘‘నేడు బహుళ ధ్రువ, సమ్మిళిత ప్రపంచం ఆవిష్కృతం కావాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వంటి ప్రపంచస్థాయి సంస్థల్లో సమగ్ర సంస్కరణలతోనే ప్రారంభం కావాలి. బ్రిక్స్ను విస్తరించడం, కొత్త స్నేహితులను ఇందులో భాగస్వాములను చేయడం… కాలంతో పాటు ఆర్గనైజేషన్ మారుతోందని చెప్పేందుకు నిదర్శనం. 20వ శతాబ్దం నాటి టైప్రైటర్లతో 21వ శతాబ్దం నాటి సాఫ్ట్వేర్ నడవదు. అలాగే, ప్రపంచస్థాయి సంస్థల్లో ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భారత్ ఎప్పుడూ తన సొంత ప్రయోజనాలకంటే మానవాళి ప్రయోజనాల కోసం పని చేయడాన్నే బాధ్యతగా భావిస్తుంది. బ్రిక్స్ దేశాలతో కలిసి అన్ని అంశాలపై నిర్మాణాత్మక సహకారం అందించేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది’’ అని మోదీ స్పష్టం చేశారు.
Also Read : F-35B Jet: కేరళకు యూకే ఏవియేషన్ ఇంజినీర్లు ! ఎఫ్-35 ఎయిర్ లిఫ్ట్కు రంగం సిద్ధం !
