PM Narendra Modi: ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల సంతాపం

ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల సంతాపం

PM Narendra Modi : గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌ కు బయల్దేరిన ఎయిరిండియా లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 242 మంది ప్రయాణీకులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు కూడా మృతి చెందారని… ఆ విమానం కూలిన బీజే మెడికల్‌ కాలేజీ యూజీ హస్టల్‌ లంచ్ చేస్తున్న 20 మంది మెడికోలు కూడా మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనితో ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ (PM Narendra Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితో (Ram Mohan Naidu) ఫోన్లో మాట్లాడిన ప్రధాని… ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ చేయాలని కేంద్రమంత్రిని ఆదేశించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని రామ్మోహన్‌ నాయుడు, అమిత్‌ షాకు ప్రధాని సూచించారు.

PM Narendra Modi – మాటలకందని విషాదం – రాష్ట్రపతి ముర్ము, మోదీ దిగ్భ్రాంతి

‘‘అహ్మదాబాద్‌లో (Ahmedabad) జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందాను. ఇది హృదయ విదారకర ఘటన. దీనిపై మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుంది’’ – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

‘‘అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదం. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా’’ – ప్రధాని నరేంద్ర మోదీ

‘‘విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాల ఆవేదన వర్ణణాతీతం. ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం, ప్రతి క్షణం విలువైనదే. సహాయకచర్యలు వేగంగా జరగాలి. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా కాంగ్రెస్‌ కార్యకర్తలు ముందుండాలి’’ – కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ

లండన్‌ గాట్విక్‌కు బయల్దేరిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని విచారం చెందారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు – బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌

భారత్‌లో జరిగిన విమానం ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో యూకే, కెనడా, పోర్చుగల్‌ ఇలా ఇతర దేశ ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరంతా ప్రమాదానికి గురి అయినందుకు చింతిస్తున్నాను. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. – జెలెన్‌స్కీ

అహ్మాదాబాద్‌ సమీపంలో ఎయిరిండియా విమానానికి జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నాము. – మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు

గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం ఘటన హృదయవిదారకం. ఈ బాధిత కుటుంబాలు కోలుకోవాలని ఆశిస్తున్నా. – యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా

భారత్‌లో జరిగిన విమాన ప్రమాదం మమ్మల్ని ఎంతో బాధించింది. బాధితులు త్వరగా కోలుకోవాలి. – భారత్‌లోని కెనడా హైకమిషన్‌

Also Read : TATA Group: మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్‌

Leave A Reply

Your Email Id will not be published!