PM Narendra Modi: అమెరికా సుంకాల వేళ కేంద్రమంత్రులతో మోదీ ప్రత్యేక భేటీ
అమెరికా సుంకాల వేళ కేంద్రమంత్రులతో మోదీ ప్రత్యేక భేటీ
Narendra Modi : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో ఇటీవల భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. పాత 25శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదనపు 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. సుంకాల విషయంపై ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అత్యవసరంగా సోమవారం సాయంత్రం 6.30 గంటలకు దిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆర్థిక సలహా మండలి (EAC) సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా ఏడుగురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
PM Narendra Modi Key Meeting
ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్షా (Amit Shah), రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ మంత్రి నితిన్ గడ్కరి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశంలోని ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిని అంచనా వేసి… దాని ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు చేరుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలలో అనిశ్చితి, బీజింగ్, మాస్కోలతో వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, గవర్నన్స్ పటిష్టత దిశగా వ్యూహాత్మక విధానాల రూపకల్పను ఉద్దేశించి ఈ సమావేశం నిర్వహించారు. ఈజీ ఆఫ్ లివింగ్, ఈజీ ఆప్ డూయింగ్ బిజినెస్, సర్వతోముఖాభివృద్ధి దిశగా వివిధ రంగాల్లో వేగవంతమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనంతరం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విషయాలను మోదీ తెలియజేశారు. నెక్స్ట్ జనరేషన్ రిఫామ్స్ కోసం రోడ్మ్యాప్ తెచ్చేందుకు జరిపిన సమావేశానికి అధ్యక్షత వహించానని, అన్నిరంగాల్లోనూ వేగవంతమైన సంస్కరణలు తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
Also Read : Surat: సూరత్లో రూ. 25 కోట్ల విలువైన డైమండ్స్ చోరీ
