PM Narendra Modi: అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

Narendra Modi : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న ప్రధాని మోదీకు… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో రాజధాని ప్రాంతానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆశక్తికరంగా తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేసారు. అనంతరం అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ(Narendra Modi) ప్రసంగించారు.

PM Narendra Modi Visit Amaravathi

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ(Narendra Modi)… “అమరావతి(Amaravathi) స్వప్నం సాకారమవుతోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుతోంది. దుర్గాభవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇది. ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నాను.” అని తన ప్రసంగంలో వెల్లడించారు.

అమరావతి ఒక నగరం కాదు… ఒక శక్తి అని పేర్కొన్న ప్రధాని మోదీ(Narendra Modi).. “ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉంది. ఇవి శంకుస్థాపనలు కాదు… ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌ కు నిదర్శనం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. రికార్డు స్పీడ్‌ లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుంది. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది.

అమరావతి నిర్మాణానికి సహకరిస్తాం –  ప్రధాని మోదీ

అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమరావతి(Amaravathi) నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్న ప్రధాని… రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. నేను గుజరాత్‌ సీఎం అయ్యాక హైదరాబాద్‌ లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. అధికారుల్ని పంపించి హైదరాబాద్‌ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించా. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా… త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశా. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది. అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించింది. ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగుతుంది. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుంది’’ అన్నారు. దాదాపు రూ.60వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా. ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతి, ఆశలు, వికసిత్‌ భారత్‌ ఆశయాలకు బలమైన పునాదులు.

కనెక్టివిటీకి కొత్త అధ్యాయం

‘‘ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుంది. ఈ అనుసంధానం తీర్థయాత్రలకు పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌ రూ.900 కోట్ల లోపే ఉండేది. ఇప్పుడు కేవలం ఏపీకే రూ.9వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చాం. ఏపీకి గతం కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించాం. గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జ్‌లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. వందేభారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు కేటాయించాం. ఏపీలో 70కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. సిమెంట్‌, స్టీల్‌, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాజెక్టుల వల్ల వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైతు వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషిచేస్తోంది. రైతులకు పథకాలు, పరిహారం కింద రూ.17వేల కోట్లు సాయం చేశాం. పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేస్తాం. ప్రతి ఎకరానికీ నీరు ఇచ్చేందుకు కృషిచేస్తాం’’

‘‘వికసిత్‌ భారత్‌ నిర్మాణం కావాలంటే మహిళలు, కార్మికులు అభివృద్ధి చెందాలి. ఈ నాలుగు వర్గాలు నాలుగు స్తంభాలు లాంటివారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. నాగాయలంకలో టెస్టింగ్‌ రేంజ్‌.. దుర్గామాత లాగా భారత రక్షణ రంగానికి శక్తినిస్తుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించే ప్రతి రాకెట్‌ కోట్లాది భారతీయులకు గర్వకారణం. భారత శక్తి అంటే కేవలం మన ఆయుధాలే కాదు.. మన ఐక్యత కూడా. విశాఖలో యునిటీమాల్‌ అభివృద్ధి చేస్తున్నాం’’

విశాఖలో యోగా డేకు హాజరవుతా – ప్రధాని మోదీ

‘‘విశాఖలో జూన్‌ 21న జరగనున్న యోగా డేలో పాల్గొంటాను. నన్ను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్‌. మన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. వచ్చే 50 రోజులూ ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలి. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు… ఆ కలల్ని నిజం చేసేవారి సంఖ్యా తక్కువకాదు. ఏపీ సరైన మార్గంలో నడుస్తోంది. సరైన వేగంతో ముందుకెళ్తోంది. దీన్ని కొనసాగించాలి. మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం అన్నారు. ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో నేను ఊహించగలను. అది ఏపీ రాష్ట్రం చరిత్ర గతిని మార్చబోతోంది. ఏపీ అభివృద్ధిలో మీ భుజంతో కలిపి నా భుజం కలిపి పనిచేస్తాను. అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని ప్రధాని తెలిపారు.

ఎన్టీఆర్ కల సాకారం చేస్తాం – ప్రధాని మోదీ

అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవ సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ ఎన్టీఆర్‌(NTR)ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కల సాకారం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… ‘వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ కోసం ఎన్టీఆర్‌ కలలు కన్నారు. నేను, చంద్రబాబు, పవన్‌ కలిసి వికసిత్‌ ఆంధ్ర కోసం కృషి చేస్తాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దుష్టగ్రహాలన్నీ పారిపోయాయి. చంద్రబాబు నాకు టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. చంద్రబాబును చూసే నేను టెక్నాలజీ తెలుసుకున్నా’ అని అన్నారు.

Also Read : DOST Notification: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల

Leave A Reply

Your Email Id will not be published!