PM Narendra Modi: ప్రధాని మోదీకు ‘మిత్ర విభూషణ’ అవార్డు ప్రదానం చేసిన శ్రీలంక
ప్రధాని మోదీకు ‘మిత్ర విభూషణ’ అవార్డు ప్రదానం చేసిన శ్రీలంక
PM Narendra Modi : మూడు రోజుల శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ(PM Narendra Modi), శ్రీలంక అధ్యక్షుడు అసుర కుమార దిసనాయకేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భారత్, శ్రీలంక తొలిసారి చరిత్రాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. విద్యుత్, ఇంధనం, డిజిటల్ సహా ఏడు ప్రధాన అంశాలపైనా ఇరుదేశాల అధినేతల సమక్షంలో ఎంవోయూలు ఖరారయ్యాయి. అరబ్ ఎమిరెట్స్ను కూడా కలుపుకొని ట్రింకోమలీలో ఎనర్జీ హబ్ను అభివృద్ధి చేయాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుండి శ్రీలంకకు సాయం ఇకముందు కూడా కొనసాగుతుందని మోదీ హామీ ఇచ్చారు. అలాగే శ్రీలంకలోని తమిళ జాతీయులకు న్యాయం, గౌరవం దక్కాలని భారత్ బలంగా కోరుకుంటోందని లంక పాలకుల దృష్టికి ఆయన తెచ్చారు. ఈ సందర్భంగా శ్రీలంక అధ్యక్షుడు అసుర కుమార దిసనాయకే… ప్రధాని మోదీకి ‘మిత్ర విభూషణ’ అవార్డు ప్రదానం చేశారు. విదేశీ అధినేతలకు శ్రీలంక ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ఇది. దీనిని తాను వ్యక్తిగతంగా కాకుండా, 140 కోట్లమంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తానని మోదీ తెలిపారు.
PM Narendra Modi Got Award
ఈ సందర్భంగా ప్రధాని మోదీ… తమిళ మత్స్యకారుల సమస్యను లంకాధ్యక్షుడితో చర్చించారు. తమిళ మత్స్యకారుల విడుదల, వారి బోట్లను వెనక్కి ఇచ్చే విషయాన్ని మానవత్వంతో పరిశీలించాలని లంక పాలకులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రక్రియలో లంక తమిళులను భాగం చేస్తూ ప్రొవెన్షియల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ప్రస్తావించారు. లంక తూర్పు ప్రాంతాల సామాజిక,, ఆర్థిక అభివృద్ధి కోసం 2.4 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి గతంలో శ్రీలంకకు ఇచ్చిన రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు చెప్పారు. రక్షణ ఒప్పందంలో భాగంగా.. పరస్పర సహకారంతో కొలంబో రక్షణ సదస్సు నిర్వహించాలని, హిందూ మహాసముద్ర జలాల్లో రక్షణపరంగా కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు.
Also Read : Waqf Bill: వక్ఫ్ బిల్లుకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము