PM Narendra Modi: అహ్మదాబాద్ లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్ లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
PM Narendra Modi : అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురై సుమారు 265 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ… శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను ప్రధాని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం నుంచి తానేలా బయటపడ్డానో ప్రధానికి బాధితుడు వివరించాడు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ(PM Narendra Modi) మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు.
PM Narendra Modi – ఊహించని విషాదం – మోదీ
అనంతరం ఈ ప్రమాదంపై మోదీ స్పందించారు. ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలననంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆ వేదనను మాటల్లోనే చెప్పలేమని అన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తర్వాత మోదీ అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు.
ఘటనాస్థలానికి ఎయిరిండియా ఎండీ క్యాంప్బెల్ విల్సన్
మరోవైపు ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు కూడా నేడు అహ్మదాబాద్కు చేరుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు.
Also Read : Ahmedabad Plane Crash: నిపుణులకు సైతం అంతుపట్టని ఎయిర్ ఇండియా ప్రమాదం ! అసలేం జరిగింది ?