Rahul Gandhi: బిహార్ కేరాఫ్ గూండాల రాజ్యం – రాహుల్ గాంధీ
బిహార్ కేరాఫ్ గూండాల రాజ్యం - రాహుల్ గాంధీ
Rahul Gandhi : నితీష్ కుమర్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిహార్ రాజధాని పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై రాహుల్ మాట్లాడుతూ… నీతీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గూండాల రాజ్యంగా మార్చిందని దుయ్యబట్టారు. నేడు బిహార్ దోపిడీ, కాల్పులు, హత్యల నీడలో నివసిస్తోందని… రాష్ట్రంలో నేరాలు జరగడమనేది సాధారణంగా మారిపోయిందన్నారు. వీటిని నిర్మూలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్ర పౌరులను రక్షించలేని పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలెవరూ ఓటువేయొద్దని విజ్ఞప్తి చేశారు.
Rahul Gandhi Shocking Comments
దారుణాలు, దోపిడీలను పూర్తిగా నిర్మూలించి, పురోగతి వైపు అడుగులు వేసే సమయం బిహార్ కు వచ్చిందని రాహుల్ (Rahul Gandhi) పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేసే ఓట్లు కేవలం ప్రభుత్వాన్ని మార్చడానికే కాక… రాష్ట్రాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయన్నారు. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
పట్నాలో గాంధీ మైదాన్ ఠాణా పరిధిలోని రాంగులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో తన ఇంటికి చేరుకున్న ఆయన కారు దిగుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన బిహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాల్ ఖేమ్కాను దుండగులు పట్నా నడిబొడ్డున హత్య చేస్తే… అక్కడికి పోలీసులు రావడానికి రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు. ఆరేళ్ల క్రితం వ్యాపారవేత్త కుమారుడిని ఇదే విధంగా హత్య చేస్తే… ఇప్పటికీ ఆ హంతకులను అరెస్టు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తుతున్న వరదలు ! రెడ్ అలర్ట్ జారీ !
