Rahul Gandhi Yatra Comment : పాద యాత్ర పవర్ లోకి తెస్తుందా
మారిన రాహుల్ గాంధీ మార్గం
Rahul Gandhi Yatra Comment : ఎక్కడైనా నాయకుడు అన్నవాడు పోయిన చోటే వెతుక్కోవాలి. అదే పని చేస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. గాంధీ కుటుంబం నుంచి భావి ప్రధానమంత్రిగా ముందుకు తీసుకు వచ్చి పార్టీ. 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఏకైక పార్టీగా కాంగ్రెస్ కు పేరుంది.
ఇదే సమయంలో ఎన్నో ఆటు పోట్లు మరెన్నో మైలు రాళ్లు ఉన్నాయి ఆ పార్టీకి. ఎప్పుడైతే రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించిందో గతంలో ఎన్నడూ లేని రీతిలో పార్టీకి అత్యంత తక్కువ సీట్లు రావడం కోలుకోలేని షాక్ కు గురి చేసింది. మరో వైపు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటోంది.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశమంతటా ఒకే దేశం ఒకే పార్టీ ఒకే మతం ఒకే కులం ఒకే భాష ఒకే నినాదం అన్న టార్గెట్ తో దూసుకు పోతోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. మిగతా వాటిలో అత్యధిక రాష్ట్రాలలో కాషాయం పవర్ లో కొనసాగుతోంది.
ఇంకో వైపు ఏ మాత్రం అంచనాలు లేని ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా ఊడ్చేసినంత పని చేసింది కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీజేపీలను పంజాబ్ లో. అంతే కాదు బీజేపీ ఎన్ని వ్యూహాలు, కుట్రలు పన్నినా దేశ రాజధానిలో జెండా ఎగుర వేసింది.
ఈ తరుణంలో పార్టీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో తాజాగా అధ్యక్ష పదవికి పోటీ జరగడం మల్లికార్జున్ ఖర్గే చీప్ గా ఎన్నికైనా పూర్తి స్థాయిలో పట్టు మాత్రం గాంధీ ఫ్యామిలీకే ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీల కంటే ముందంజలో కొనసాగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా పాత కాలంలోనే ఉంటోంది.
ప్రస్తుతం ప్రచురణ, ప్రసార, డిజిటల్ , సోషల్ మీడియాలో కాషాయ దళాన్ని ఎదుర్కొనే స్థితిలో పార్టీ లేదనేది వాస్తవం. ఈ తరుణంలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు.
ఈ మేరకు తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. మొత్తం 3,578 కిలోమీటర్లు 150 రోజుల పాటు కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక పూర్తయింది. ఏపీలో కొనసాగుతోంది. దక్షిణాదిన పార్టీకి వర్కవుట్ అయినా
ఉత్తరాదిలో ఎక్కువగా సీట్లను తెచ్చు కోవాల్సి ఉంటుంది.
ఈ యాత్ర 2024లో మళ్లీ పవర్ లోకి వచ్చేందుకు ఏమైనా ఉపయోగ పడుతుందా అన్నది పార్టీ వర్గాలు చెప్పాల్సి ఉంటుంది.జనం అన్ని సభలకు, ర్యాలీలకు, పాదయాత్రలకు వస్తారు. కానీ చివరకు ఓట్లు వేసే సమయానికి తాము అనుకున్న వారికే వేస్తారనేది వాస్తవం.
గత కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంది రాహుల్ గాంధీ పాదయాత్ర(Rahul Gandhi Yatra) చేపట్టడంతో. గతంలో లాగా కాకుండా యువ నాయకుడు జీవన శైలిలో మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రధానంగా నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని, దాని అనుబంధ సంస్థలను, కేంద్ర సర్కార్ వైఫల్యాలను ఎండగుడుతున్నారు. అంతే కాదు ప్రధాన సమస్యలను ఎత్తి చూపడంలో మిగతా వారి కంటే రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు.
కానీ దేశ వ్యాప్తంగా ఆక్టోపస్ లా అల్లుకు పోయిన బీజేపీని ఢీకొనాలంటే పటిష్టమైన నాయకత్వం, కార్యవర్గం అవసరం. కుమ్ములాటలు,
ఆధిపత్యాలు, పదవుల పంపకాల మధ్య నేటికీ ఇంకా సయోధ్య కుదరడం లేదు.
ఆధునికతను అంది పుచ్చుకుని పార్టీకి బలాన్ని చేకూర్చే సత్తా కలిగిన నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవసరం. మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడిగా
అనుభవం ఒకందుకు పనికి వస్తుందనుకున్నా యువ రక్తాన్ని పార్టీకి తీసుకు రావడంలో ఆయన ఎంత మేరకు సక్సెస్ కాగలరనేది ప్రశ్నార్థకమే.
ఓ వైపు బీజేపీ మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని రాజకీయం చేస్తోంది. మరి కాంగ్రెస్ సెక్యులరిజం నినాదంతో ముందుకు వెళుతోంది.
ఈ తరుణంలో అగ్ర నాయకుడిలో కూడా మార్పు రావడం విస్తు పోయేలా చేస్తోంది. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా గుళ్లు, స్వాములను కలుస్తున్నారు.
అంటే తాను అందరి వాడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా భారత్ జోడో యాత్ర ఏ మేరకు
పవర్ లోకి తీసుకు వస్తుందా లేక పార్టీని బతికిస్తుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : ద్వేష పూరిత ప్రసంగాలపై ‘సుప్రీం’ సీరియస్