Sharmishta Panoli: శర్మిష్ఠ పనోలీని విడుదల చేయండి – ప్రధాని మోదీకి డచ్ ఎంపీ రిక్వెస్ట్
శర్మిష్ఠ పనోలీని విడుదల చేయండి - ప్రధాని మోదీకి డచ్ ఎంపీ రిక్వెస్ట్
Sharmishta Panoli : ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టడంతో పూనేకు చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని(Sharmishta Panoli) కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమెను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ విషయంపై తాజాగా డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా… పోలీసులు అమెను అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Sharmishta Panoli Case Updates
కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందన్నారు. ఆమెను శిక్షించవద్దని కోరారు. ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ఠను విడుదల చేయాలని అధికారులను ఆదేశించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి(PM Modi) విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి శర్మిష్ఠపైనే ఉందని పేర్కొంటూ… ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పుణెకు చెందిన లా స్టూడెంట్ శర్మిష్ఠ పనోలి గురుగ్రామ్ లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె.. ఆపరేషన్ సిందూర్పై స్పందించింది. ఒక వీడియోను మే 14, 2025న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ అభ్యంకర వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ… పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ… ఆమె ఒక మతంపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
అనంతరం.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. రాడికల్ పాకిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై, పెట్టిన పోస్టులపై అదే సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు కోరింది. అప్పటికే ఈ క్లిప్ వైరల్ కావడంతో కోల్కత్తా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా కోల్కత్తా పోలీసులు షర్మిస్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ అన్యాయంగా జరిగిందని, అనైతికమని, ఆమెను తక్షణమే విడుదల చేయాలని కూడా సోషల్ మీడియలో #ReleaseSharmistha హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం గమనార్హం. ఆమె ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. అయితే, పోలీసులు 19ఏళ్ల యువతిని అరెస్ట్ చేయడానికి 1500 కిలోమీటర్లు ప్రయాణించడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read : Essay Competition: ఆపరేషన్ సిందూర్ పై ‘వ్యాసరచన’ పోటీ