Supriya Sule: ఎయిరిండియా విమాన సర్వీస్ పై ఎంపీ సుప్రియా అసహనం
ఎయిరిండియా విమాన సర్వీస్ పై ఎంపీ సుప్రియా అసహనం
దిల్లీ నుంచి పుణె వెళ్తున్న ఎయిరిండియా విమానం మూడు గంటలకు పైగా ఆలస్యం కావడంపై ఎంపీ సుప్రియా సూలే అసహనం వ్యక్తంచేశారు. ప్రయాణికులకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఎయిరిండియా సంస్థ తీరును ఆమె తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె తన అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. దీనితో ఆమె పోస్ట్ పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.
‘‘దిల్లీ నుంచి పుణె వెళ్తున్న ఎయిరిండియా విమానం AI 2971లో నేను ప్రయాణించాల్సి ఉంది. విమానం మూడు గంటలకు పైగా ఆలస్యమయింది. దీనిపై ప్రయాణికులకు ఎటువంటి సమాచారం లేదు. ఇలాంటి ఆలస్యాలు, సేవా లోపాలు ఎయిరిండియాలో సర్వసాధారణంగా మారాయి’’ అని ఆమె ఎక్స్లో పేర్కొన్నారు. అంతేకాదు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును, టాటా గ్రూప్ను ఆమె ట్యాగ్ చేశారు. ప్రయాణిలకు మెరుగైన సేవలందేలా చూడాలని పోస్ట్ చేశారు.
ఎంపీ సుప్రియా సూలే పోస్ట్ పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సంబంధిత విమాన సంస్థతో పాటు విమానాశ్రయ అధికారులతో స్వయంగా మాట్లాడానన్నారు. ప్రయాణికులకు తగిన సాయం అందించాలని సూచించినట్లు ఎక్స్ వేదికగా బదులిచ్చారు. మంత్రి రామ్మోహన్ నాయుడు పోస్టుపై ఎయిరిండియా కూడా స్పందించింది. ఆలస్యం వల్ల ఇబ్బందికి గురైన ప్రయాణికులందరికీ తమ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు ఎదురైన ఈ అవాంతరానికి చింతిస్తున్నామని పేర్కొంది.
48 గంటల్లో 9 ఘటనలు – డీజీసీఏ సీరియస్
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈలోపే వరుసగా ఎయిర్ క్రాఫ్ట్లలో సాంకేతిక లోపాలు వెలుగుచూడటం, సర్వీసులు రద్దు చేయడంపై డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ… ఎయిరిండియా ఇంజనీరింగ్ చీఫ్కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.