The kerala Story Comment : నిన్న ‘ఫైల్స్’ నేడు కేర‌ళ స్టోరీ

వివాదాస్పదం విజ‌య‌వంతం

The Kerala Story Comment : ఈ దేశంలో సినిమా రంగానికి ఉన్నంత ప్ర‌యారిటీ ఇంకే దానికి ఉండ‌దు. దేశంలో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ స‌ర్కార్ కొలువు తీరాక యావ‌త్ స‌మాజం కొన్ని వ‌ర్గాలుగా చీలి పోయింది. గ‌తంలో వామ‌ప‌క్ష భావాల‌తో కూడిన సినిమాలకు ప్ర‌యారిటీ ఉండేది. ఆర్ట్ సినిమాల‌కు ఎక్కువ‌గా అవార్డులు ద‌క్కేవి. కానీ సీన్ మారింది. చ‌రిత్ర మారుతోంది. 

విచిత్రం ఏమిటంటే 75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో చారిత్ర‌క సంఘ‌ట‌న‌లు, దాని ఆధారాలు, పేర్లు, క‌థ‌లు, ఘ‌ట‌న‌లకు సంబంధించిన ఆధారాల‌న్నింటినీ మార్చే ప‌నిలో ప‌డింది కేంద్రం. ప్ర‌ధానంగా బీజేపీ దాని ప‌రివారాలు ఇప్పుడు కాషాయ ఎజెండాను మెల మెల్ల‌గా అమ‌లు చేయాల‌ని చూస్తోంది.

ఇదే స‌మ‌యంలో వ‌చ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ సంచ‌ల‌నం సృష్టించింది. సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి ఆ సినిమాను ప్ర‌మోట్ చేశారు. మిగ‌తా వారంతా పోటీ ప‌డ్డారు. గోవాలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో జ్యూరీ క‌మిటీ ఇది సినిమానే కాద‌ని, పోటీకి అర్హ‌త పొంద‌ద‌ని పేర్కొన్నారు. ఇక దిగ్గ‌జ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అయితే దానిని డాక్యుమెంట‌రీకి కూడా తక్కువేనంటూ ఎద్దేవా చేశాడు.

తాజాగా మ‌రో సినిమా(The Kerala Story Comment) వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అదే ది కేర‌ళ స్టోరీ. ఇప్పుడు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ వ్య‌తిరేకిస్తే బీజేపీ దానిని స‌మ‌ర్థిస్తోంది. తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సైతం ఈ సినిమాను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దీంతో మ‌రోసారి దేశ‌మంత‌టా చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ప్ర‌చారంలో టాప్ లో కొన‌సాగే మోదీ ఏది చెప్పినా లేక ప్ర‌స్తావించినా దానికి మైలేజీ వ‌స్తుంద‌నేది వాస్త‌వం. ఇదో ర‌క‌మైన ప్ర‌చారం అని కూడా మేధావులు పేర్కొంటున్నారు.

ఇది ప‌క్క‌న పెడితే ది కేర‌ళ స్టోరీ విడుద‌ల కంటే ముందు వివాదాలు చుట్టు ముట్టాయి. సుప్రీంకోర్టు క్లియ‌రెన్స్ ఇచ్చింది. 32,000 ట్రైల‌ర్ ను నిలిపి వేయాల‌ని సినిమాలో అభ్యంత‌ర‌క‌ర‌మైన స‌న్నివేశాలు ఏవీ లేవంటూ కేర‌ళ హైకోర్టు తాజాగా తీర్పు చెప్పింది.

సినిమా ప‌రంగా చూస్తే కేర‌ళ రాష్ట్రంలో జ‌రిగిన య‌ధార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించామ‌ని ద‌ర్శ‌కుడు స్ప‌ష్టం చేశాడు. కాస‌ర్ గోడ్ లో ల‌వ్ జిహాద్ , అత్యాచారం, లైంగిక బానిస‌త్వం, రాడిక‌లైజేష‌న్ , బోధ‌న‌, ఐసిస్ రిక్రూట్ మెంట్ వంటి అమాన‌వీయ నేరాల వ‌ల్ల ముగ్గురు మ‌హిళలు ఎదుర్కొన్న దుస్థితిని చూపించాడు.

ఈ చిత్రంలో అదా శ‌ర్మ‌, యోగితా బిహానీ, సోనియా బ‌లానీ, సిద్ది ఇద్నానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. యుఎన్ డిటెన్ష‌న్ సెంట‌ర్ లో గాయ‌ప‌డిన అదా శ‌ర్మ స‌న్నివేశంతో మొద‌ల‌వుతుంది ది కేర‌ళ స్టోరీ. విచార‌ణ స‌మ‌యంలో ట్రైనింగ్ పొంది ఐసిస్ ఉగ్ర‌వాదిగా ఎలా అడుగు పెట్టిందో గుర్తు చేసుకుంటుంది. ఆఫ్గ‌నిస్తాన్ తో స్టార్ట్ అయి దేవుళ్ల‌కు ఆవ‌సంగా పిల‌వ‌డే కేర‌ళ‌కు చేరుకుంటుంది. న‌ర్సింగ్ కాలేజీలో చేరుతుంది అదా శ‌ర్మ‌. ఇస్లాం మ‌తంలోకి మారేందుకు సిద్ద‌ప‌డిన మ‌రో ఇద్ద‌రు అమ్మాయిల‌ను క‌లుస్తుంది.

ఆ త‌ర్వాత క‌థ‌ను న‌డిపించాడు. అంతే కాదు ఐసిస్ లోకి 32 వేల మందికి పైగా మ‌హిళ‌లు గాయ‌బ్ అయ్యార‌నేది ఆరోప‌ణ‌. ఈ చిత్రంలో హిందూవుల ఆరాధ‌న‌, నాస్తిక‌త్వం, క‌మ్యూనిసం, ఇస్లాం ష‌రియా చ‌ట్టాల‌ను తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

సుదీప్తో సేన్ ద‌ర్శ‌క‌త్వం బాగానే ఉంది. కానీ రాజ‌కీయంగా వివాదాస్పం కావ‌డ‌మే ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏది ఏమైనా సినిమా అన్న‌ది ప్ర‌జ‌ల్ని, స‌మాజాన్ని ప్ర‌తిబింబించాలి..కానీ భావోద్వేగాల‌ను రెచ్చ గొట్ట కూడ‌దు. మాన‌వ స‌మూహ‌పు లోతుల్ని ఛిద్రం చేయ‌కూడ‌దు. ఇది గ‌మనిస్తే స‌మాజానికి, సినిమా రంగానికి మేలు.

Also Read : మోదీ నోట కేర‌ళ స్టోరీ మాట

Leave A Reply

Your Email Id will not be published!