TSPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
TSPSC Group 1 : గత ఏడాది అక్టోబర్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన… గ్రూప్-1 పరీక్షా ఫలితాలను సోమవారం విడుదల చేసారు. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. గ్రూప్ 1(TSPSC Group 1) పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, మెయిన్స్ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా మార్కులను పొందొచ్చు. మొత్తం ఏడు పేపర్లుగా నిర్వహంచిన ఈ పరీక్ష వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు… మార్కుల వివరాలను తాజాగా అభ్యర్థుల లాగిన్ లలో అందుబాటులో ఉంచారు. ఈ మార్కులను మార్చి 16 సాయంత్రం 5గంటల వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మెయిన్స్ లో సాధించిన మార్కుల షీట్లను డౌన్ లోడ్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాచి ఉంచాలని టీజీపీఎస్సీ సూచించింది.
TSPSC Group 1 Mains
మరోవైపు, అభ్యర్థులకు తమ మార్కుల రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్చి 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఒక్కో పేపర్ కు రూ.1000 చొప్పున చెల్లించి మార్కుల రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం కేవలం ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులందరి మొత్తం మార్కులను కమిషన్ వెబ్సైట్లో ఉంచుతారు. తుది జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసి.. దాని ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలవనున్నారు. నోటిఫికేషన్లో సూచించినట్లుగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. మార్కుల షీట్లు డౌన్లోడ్/ రీకౌంటింగ్ దరఖాస్తుకు సంబంధించి ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు ఎదురైతే.. అభ్యర్థులు 040-23542185/040-23542187 లేదా helpdesk@tspsc.gov.in ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.
మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకూ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. ఈ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఉమ్మడి హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్(TSPSC Group 1) పరీక్షల కోసం తెలంగాణ(Telangana) ప్రభుత్వం బయోమెట్రిక్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసింది. హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ కేంద్రాల్లో ఐపీఎస్ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది.
Also Read : Hydra Ranganath: ప్రణయ్ హత్య కేసు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ షాకింగ్ కామెంట్స్