హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే సాయం అందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ఉద్దేశించిన యువ ఆపద మిత్ర శిక్షణను జిల్లా, గ్రామ స్థాయికి విస్తరిస్తామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ఇందుకు మొబైల్ వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. విపత్తుల సమయంలో తమను తాము కాపాడు కోవడమే కాకుండా.. చుట్టు పక్కల వారిని కూడా రక్షించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘యువ ఆపద మిత్ర’ పథకం రెండో బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో రంగనాథ్ మాట్లాడారు. ఆపద సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనడంతో పాటు ప్రాణాలు కాపాడడం సాధారణ విషయం కాదని హైడ్రా కమిషనర్ అన్నారు.
సేవ చేయాలనే ఆలోచనే మిమ్ములను యువ ఆపద మిత్రలను చేసిందన్నారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి వివిధ కళాశాలలకు చెందిన మొత్తం 103 మంది విద్యార్థులు హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు ఏవీ రంగనాథ్. మన గురించి, మన కుటుంబం కోసమే కాకుండా.. మన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించే భావం నిత్యం ఉండాలని సూచించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు ఇలా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు మేమున్నామనే ధైర్యాన్ని యువ ఆపద మిత్రులు ఇవ్వాలని సూచించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సుతో పాటు.. వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేసేందుకు అందుబాటులో ఉండేది యువ ఆపద మిత్రులన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఆపద మిత్రులకు ధ్రువ పత్రాలను హైడ్రా కమిషనర్ అందజేశారు.
