వద్దనుకుంటే విషం ఇచ్చి చంపేయండి : కోమటిరెడ్డి
సంచలన వ్యాఖ్యలు చేసిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కు మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, విస్తృతంగా సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం, ఓ ఛానల్ ఏకంగా తన గురించి ప్రత్యేక కథనాన్ని టెలికాస్ట్ చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారారు మంత్రి. దేశ వ్యాప్తంగా ఆయన వ్యవహారం చర్చకు దారితీసేలా చేసింది. దీంతో గత్యంతరం లేక మీడియా ముందుకు వచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు సదరు లేడీ ఆఫీసర్ కు మధ్య ఎలాంటి లింక్ లేదని పేర్కొన్నారు. అదంతా దేవుడే చూసుకుంటాడని , తనకు అంత సీన్ లేదన్నారు . తనకు ఉన్న ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి బాధలో ఉన్నానని, తన కొడుకు పేరు మీద ఫౌండేషన్ పెట్టి సేవలు చేస్తున్నానని చెప్పారు .
నన్ను ఏమైనా అనండి, నాపై ఏదైనా రాయండి కానీ మహిళా అధికారిపై ఇష్టం వచ్చినట్లు రాసి ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం సీఎంకే ఉంటుందని, ఆ పవర్స్ తనకు ఉండవని చెప్పారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కాలేరని, త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు .దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన చరిత్ర తనదన్నారు. అద్దె ఇంట్లో ఉండి ప్రజలకు సేవ చేశానని అన్నారు. నా కొడుకును కోల్పోయినప్పుడే తాను సగం చని పోయానని, దయచేసి నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
