Digvijay Singh : పుల్వామా.. సర్జికల్ స్ట్రైక్ నివేదిక ఎక్కడ
మోదీ ప్రభుత్వానికి డిగ్గీ రాజా ప్రశ్న
Digvijay Singh : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్య ప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పుల్వామా, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ పై ఇప్పటి వరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇందులో ఏమైనా దాచి ఉంచాల్సినవి ఉన్నాయా అంటూ నిలదీశారు దిగ్విజయ్ సింగ్.
2016 సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రుజువు చేయలేదని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అసత్య ప్రచారం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఆనాటి సర్జికల్ స్ట్రైక్ తో పాటు 2019లో పుల్వామా ఉగ్ర దాడిపై కేంద్రం ఇప్పటి వరకు పార్లమెంట్ ముందు నివేదిక ఇవ్వలేదని దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఆనాడు పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పుల్వామాలో మన సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. సిబ్బందిని విమానంలో రప్పించాలని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పీఎంను కోరారు. కానీ ప్రధాన మంత్రి ఇందుకు అంగీకరించ లేదని ఆరోపించారు మాజీ సీఎం. అలాంటి లోపం ఎలా జరిగింది..ఇప్పటి దాకా ఎందుకు నివేదిక ఇవ్వలేక పోయారు..దానికి గల కారణాలు ఏమిటో దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు దిగ్విజయ్ సింగ్(Digvijay Singh).
Also Read : నేతాజీ జీవితం స్పూర్తిదాయకం – రాహుల్