Bhatti Vikramarka : బీఆర్ఎస్ ను తరిమి కొట్టడం ఖాయం
రక్షణ లేకుండా బయటకు రాగలరా
Bhatti Vikramarka : అరాచక పాలన సాగిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా లోని అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. ఖాకీల రక్షణ లేకుండా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు.
స్కాంలకు కేరాఫ్ గా తెలంగాణను మార్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమాన్ని చేపట్టిన కేసీఆర్ ఇవాళ అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కాడని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. సోనియా గాంధీ లేక పోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు. ఎలాంటి కృతజ్ఞత లేని నమ్మక ద్రోహి కేసీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. జనం ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు.
ఆనాటి రజాకర్లను, నాటి నైజాం సర్కార్ ను గుర్తుకు తెస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలు అమాయకులని అనుకుంటే పొరపాటు పడినట్లేనని ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. తాము అధికారంలోకి వస్తామని , ఆ వెంటనే కల్వకుంట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. వాటిని అమ్మగా వచ్చిన వాటితో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
Also Read : Rakesh Tikait
