ధూప, దీప, నైవేద్యాలకు రూ. 5 వేల నుండి రూ.10 వేలకు పెంపు

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమ‌ల : టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు బీ ఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న బుధవారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఇందులో ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం స‌ర్కిల్ నుండి బాట గంగ‌మ్మ స‌ర్కిల్ వ‌ర‌కు ఉన్న స‌ర్వ‌ద‌ర్శ‌నం క్యూలైన్ల‌లో రూ.4.55 కోట్ల‌తో అద‌న‌పు మ‌రుగుదొడ్లు నిర్మించేందుకు ఆమోదం. తెలిపింది. . తిరుమ‌ల‌లోని రోడ్లు, స‌ర్కిళ్ల‌కు క‌మిటీ సూచించిన ఆధ్యాత్మిక, పురాణ ప్రాశ‌స్థ్యం క‌లిగిన పేర్లను పెట్టాల‌ని నిర్ణ‌యించారు. టిటిడి బోర్డు విద్యా క‌మిటీ ఇచ్చిన నివేదిక మేర‌కు టీటీడీ విద్యా సంస్థ‌ల‌లో అత్యాధునిక మౌళిక వసతుల ఏర్పాటుకు అదనంగా రూ.43.40 కోట్లు మంజూరుకు ఆమోదం. ఇప్ప‌టికే గత బోర్డు స‌మావేశంలో రూ.118 కోట్లు కేటాయించిన విష‌యం తెలిసిందే. మొత్తం కలిపి రూ.161.40 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు.

తిరుమ‌ల‌లో నీటి వృధాను అరిక‌ట్టేందుకు, రోజు రోజుకు పెరుగుతున్న నీటి అవ‌స‌రాల దృష్ట్యా గోగ‌ర్భం డ్యామ్ నుండి ఫిల్ట‌ర్ ప్లాంట్ వ‌ర‌కు రూ.6 కోట్ల‌తో దాదాపు 2 కిలో మీట‌ర్ల‌ మేర అద‌న‌పు పైపులైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపామ‌న్నారు. టీటీడీ అవ‌స‌రాల నిమిత్తం రూ. 44.20 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, త‌మిళ‌నాడుకు చెందిన కో-ఆప్టెక్స్ సంస్థ‌ల నుండి ప‌ట్టు వ‌స్త్రాలు, దుప్పటాలు తదితరాలు కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపిన‌ట్లు పేర్కొన్నారు. అల్లూరు సీతారామ‌రాజు జిల్లా పాడేరు మండ‌లంలోని వ‌ర్ధ‌న‌ప‌ల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి రూ.55 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపామ‌న్నారు.

స‌నాత‌న ధ‌ర్మాన్ని మ‌రింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన “అక్షర గోవిందం” కార్యక్రమంలో పాల్గొనే చిన్న పిల్లలకు పంపిణీ చేసే కిట్‌ను ఉచితంగా అందిస్తామ‌న్నారు టీటీడీ చైర్మ‌న్. త‌మిళ‌నాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా, పెరూర్ తాలూకాలోని శెట్టిపాళ్యం గ్రామంలో జీస్క్వేర్ రియ‌ల్ట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌తినిధులు టీటీడీకి రిజిష్ట్ర‌ర్ చేసి ఇచ్చిన 19.43 ఎకరాల స్థ‌లాన్ని టీటీడీలో విలీనం చేసుకోవ‌డానికి ఆమోదం తెలిపింద‌న్నారు. మ‌హారాష్ట్ర‌లోని న‌వీ ముంబైలో టీటీడీ నూత‌నంగా నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యంలో త్వ‌ర‌లో మ‌హా సంప్రోక్ష‌ణ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైన సిబ్బందిని కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో నియామ‌కానికి ప్ర‌భుత్వ అనుమ‌తికై నివేదించాలని నిర్ణయించామన్నారు.

ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ సౌరబ్ బోరా భరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. తిరుమ‌ల‌లోని వ‌రాహ‌స్వామి విశ్రాంతి భ‌వ‌నం – 1లో రూ. 3.61 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఆమోదం ల‌భించింద‌న్నారు చైర్మ‌న్. తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద రూ.4.75 కోట్ల‌తో శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ హోమం కోసం యాగ‌శాల నిర్మించేందుకు నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హిత డా.శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా నియమించేందుకు నిర్ణ‌యం. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండ‌లంలో ఉన్న అనంతవరంలో ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యంలో రూ.2.71 కోట్ల‌తో రాజ గోపురం నిర్మాణానికి ఆమోదం తెలిపామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!