AAP Supreme Court : మేయర్ ఎన్నికపై సుప్రీంకు ఆప్
పదే పదే వాయిదా పడడంపై దావా
AAP Supreme Court : ఆశించిన మెజారిటీ ఉన్నప్పటికీ ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. సోమవారం మేయర్ ఎన్నికకు సమావేశమైన కొద్ది సేపటికే రాద్దాంతం చోటు చేసుకుంది. ఆప్ , భారతీయ జనతాపార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది.
ఎల్జీ నామినేటెడ్ సభ్యులను బీజేపీకి చెందిన వారిని నియమించారు. వారికి ఓటు హక్కు లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. చివరకు ఇరు పార్టీలకు చెందిన కొట్టుకునేంత దాకా వెళ్లడంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ మరోసారి మేయర్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
నామినేటెడ్ సభ్యులను ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎలా అనుమతి ఇస్తారంటూ ప్రశ్నించింది ఆప్. దీనిపై రగడ చోటు చేసుకోవడంతో ఎన్నికను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో ఈ ఎన్నిక వ్యవహారంపై తాము సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ఆమ్ ఆద్మీపార్టీ(AAP Supreme Court) ప్రకటించింది. ఈ మేరకు భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇది పూర్తిగా కేంద్రం ఆడుతున్న డ్రామాగా ఆరోపించింది. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలను కావాలని కేంద్రం టార్గెట్ చేసిందంటూ మండి పడింది ఆప్.
తాము దీనిని ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఆప్ సీనియర్ నాయకుడు ముఖేష్ గోయల్. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నిక వాయిదా పడడం ముచ్చటగా ఇది మూడోసారి కావడం గమనార్హం. మేయర్ ఎన్నిక కోసం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైంది. ఆ వెంటనే నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉందని ప్రకటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది ఆప్.
Also Read : ఢిల్లీ బల్దియా మేయర్ ఎన్నిక వాయిదా