తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని తెలిపారు. 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందన్నారు. ఆ సమయంలోనూ కేవలం 7 గురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని సీఎం వివరించారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనర్, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని స్పష్టం చేశారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 105 కు పెంచి కేటాయించాలని సీఎం కోరారు.
అనంతరం మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్ లో గణనీయమైన మార్పులు వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని సీఎం కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజీపీ బి. సుమతి పాల్గొన్నారు.
