హైదరాబాద్ : ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు బయలు దేరనుంది. సోమవారం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి పూజలు నిర్వహిస్తారు. అనంతరం మహా జాతరను ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి , ప్రతినిధులతో కలిసి దావోస్కు బయలు దేరారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు దావోస్లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు.
దావోస్లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి విడివిడిగా భేటీ అవుతారు. అలాగే పలు రౌండ్టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరుపుతారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను, రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
