Venkatarami Reddy: సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు !

సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు !

Venkatarami Reddy: వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆరోపణలపై రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో… ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాదు సస్పెన్షన్‌ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని హెచ్చరించింది. వెంకట్రామిరెడ్డి మొదటినుంచి ప్రభుత్వోద్యోగిలా కాకుండా వైసీపీకు అధికార ప్రతినిధిలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల కోడ్‌ కు ముందు, కోడ్‌ సమయంలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఉన్నతాధికారులు, వైసీపీ పెద్దల మద్దతు ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Venkatarami Reddy…

ఉమ్మడి కడప జిల్లాలో మార్చి 31న ప్రజారవాణా శాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, మరికొందరితో కలిసి వైసీపీకు ఓట్లు వేయాలని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేశారు. వైసీపీకు అనుకూలంగా కరపత్రాలు పంచారు. ఈ విషయం పలు పత్రికలు వెలుగులోకి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు స్పందించారు. పీటీడీకి చెందిన చల్లా చంద్రయ్యతో పాటు 10 మందిని వెంటనే సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేసారు. ఎన్నికల కోడ్‌ సమయంలో ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డి(Venkatarami Reddy)పై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సైతం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనితో ప్రభుత్వం స్పందించి, వెంకట్రామిరెడ్డిని సస్పెండ్‌ చేసింది.

వెంకట్రామిరెడ్డి ఎన్నికల కోడ్‌కు ముందు ‘మన ప్రభుత్వం- మన ప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతో మేలు జరిగిందంటూ ప్రచారం చేశారు. సంఘం నాయకుడిగా వచ్చే ఆన్‌ డ్యూటీ సదుపాయాన్ని వాడుకుంటూ జిల్లాల్లో ప్రచారాలు చేశారు. ఎన్నికల కోడ్‌ కు ముందు మార్చి 7న చిత్తూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. బహిరంగంగానే వైసీపీకు అనుకూల వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలున్నాయి. మార్చి 8న అనంతపురంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. మార్చి 10న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, అనంతరం ఉద్యోగులను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారు.

Also Read:YS Sharmila: విజయమ్మకు బర్త్‌ డే విషెష్ చెప్పిన షర్మిల !

Leave A Reply

Your Email Id will not be published!