అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ సచివాలయంలో కీలక మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. తన అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో పలు ప్రధాన అంశాలపై చర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి, అనగాని సత్య ప్రసాద్ , నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎస్. సవిత, తదితరులు హాజరయ్యారు. సీఎస్ ఆదిత్యానాథ్ తో పాటు ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు హుటా హుటిన దేశ రాజధాని ఢిల్లీకి ప్రయాణం అయ్యారు.
ఆయన ఇవాళ రాత్రి హస్తినలో మకాం చేస్తారు. రేపు మంగళవారం కేంద్ర మంత్రులను కలుస్తారు. ఆయన పర్యటనకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. ఇక నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ , కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సహా ఐదుగురు కేంద్ర మంత్రులను కలుస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి సాయంత్రం 5 గంటలకు అమరావతికి తిరిగి వస్తారు.