శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

ఈ నెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో

అమరావతి : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రం. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తమిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మాల‌లు ధ‌రించిన భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు తండోప తండాలుగా. ఇదిలా ఉండ‌గా మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం కోసం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది శ్రీ‌శైలం ఆల‌యం. మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు శ‌నివారం క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శ్రీ మ‌ల్లికార్జున స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం ఇచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు వివరించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే విధంగా మహానందిలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చూడాల‌ని సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!